మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ ప్రాంతంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో చోటుచేసుకున్న చిన్న ఘర్షణ.. తండ్రి కూతుళ్లను బలి తీసుకుంది. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్లికి చెందిన శివానంద్(46).. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం మహబూబ్నగర్కు వచ్చి.. కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. పట్టణంలోని SVS ఆస్పత్రిలో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శివానంద్ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉండగా.. కొడుకు సాయికృష్ణ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కూతురు చందన (17) ఎస్వీఎస్లోనే డీఎంఎల్టీ చదువుతోంది.
కొద్ది రోజులుగా.. కుమారుడు సాయికృష్ణకు సెల్ఫోన్లో గేమ్స్ ఆడటం వ్యసనంగా మారింది. ఎప్పుడు చూసిన.. మొబైల్లో గేమ్స్ ఆడుతూనే కనిపిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన తండ్రి శివానంద్.. కొడుకును మందలించాడు. త్వరలోనే పరీక్షలు ఉన్నాయని.. ఈ సమయంలో చదువుకోకుండా ఫోన్లో గేమ్స్ ఆడటమేంటి అంటూ కొడుకుని తిట్టాడు. ఈ క్రమంలోనే.. తన భార్య జోక్యం చేసుకుని శివానంద్ను నిలువరించింది. కొడుకును తిట్టొద్దంటూ అడ్డు చెప్పింది. ఈ విషయంలో తల్లి, తండ్రి, కుమారుని మధ్య వాగ్వాదం జరిగింది.
కుమారుడు, భార్య తన మాటకు ఎదురుతిరిగారని మనస్థాపం చెందిన శివానంద్ ఇంట్లో నుంచి ఆవేశంగా బయటకు వెళ్లిపోయాడు. వాళ్లు నివాసం ఉండే కాలనీకి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వైపు శివానంద్ వెళ్లాడు. తండ్రి ఆవేశాన్ని గమనించిన కూతురు చందన.. శివానంద్ను అనుసరిస్తూ వెళ్లింది. అదే సమయంలో.. పట్టాలపై నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ రైలుకు వెళ్తుండగా.. దానికి అడ్డుగా వెళ్లాడు శివానంద్. అది గమనించిన చందన.. "వద్దు నాన్న.. ఆగు నాన్న.." అని ఎంత అరిచినా వినకుండా పట్టాలపైకి వెళ్లాడు. ఆయన వెంటే వెళ్లిన చందన.. తండ్రిని కాపాడుకునేందుకు ప్రయత్నించగా.. ఫలితం లేకుండా పోయింది. అదే రైలు కింద పడి తండ్రీకూతుళ్లు ప్రాణాలు వదిలారు.
ఈ విషయం తెలుసుకున్న శివానంద్ భార్య కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతదేహాలను మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంతో ఆ తండ్రి తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి అతనితో పాటు కూతురు కూడా మరణించటం స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు చేసిన పని.. రెండు ప్రాణాలు పోయేలా చేసిందని అంతా మాట్లాడుకుంటున్నారు. భార్య ఆ మాట అనకుండా ఉంటే.. రెండు ప్రాణాలు దక్కేవని కూడా స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa