ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరిత్రలో తొలిసారి.. 213 మంది ఖైదీలు రిలీజ్, ఉపాధి కూడా.. ఆ రూల్స్‌ పాటించకపోతే మళ్లీ జైలుకే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 03, 2024, 07:35 PM

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 213 మంది ఖైదీలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తోంది. కేవలం విడుదల చేయటమే కాదు.. వాళ్లందరికీ ఉపాధి అవకాశాన్ని కూడా జైళ్ల శాఖ కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. విడుదలవుతున్న ఖైదీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ జైళ్ల శాఖ చరిత్రలో నేడు ఓ మైలు రాయి లాంటిదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. అందులో ఖైదీల విడుదల కోసం వారివారి కుటుంబసభ్యులు దరఖాస్తులు ఇచ్చారన్నారు.


వారి వినతులను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ ప్రకారం.. ఈ హైలెవెల్ కమిటీ ఒక లిస్ట్ తయారు చేసిందని వివరించారు. ఆ లిస్ట్‌ను కేబినెట్‌కు పంపామని.. కేబినెట్ ఆమోదం పొందిన తరువాత.. గవర్నర్ కూడా ఆమోదించారని డీజీ తెలిపారు. దీంతో ఖైదీల విడుదలకు హోంశాఖ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. దీంతో.. 205 మంది యావజ్జీవ కారాగర శిక్ష అనుభవించిన ఖైదీలు.. 8 మంది స్వల్ప కాలిక శిక్ష పడిన ఖైదీలు నేడు విడుదలవుతున్నారని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు.


విడుదలవుతున్న ఖైదీలందరికీ జీవితంలో ఇది రెండో అవకాశం అని.. ఈ అవకాశాన్ని ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జైళ్లలో కేవలం శిక్ష మాత్రమే కాదు.. శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ఖైదీలకు పలు వృత్తి విద్య నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. జైలులో ఖైదీలు తయారు చేసే వస్తువులకి మార్కెట్‌లో డిమాండ్ ఉందన్నారు. జైలుకు వచ్చిన వారిలో నిరక్షరాస్యులను సైతం అక్షరాస్యులుగా మార్చమని తెలిపారు. జైలులో చదువుకుని కొందరు ఖైదీలు పట్టభద్రులు అయ్యారని.. గోల్డ్ మెడల్ కూడా సాధించారని డీజీ చెప్పుకొచ్చారు.


కాగా.. ఖైదీలు విడుదల అయ్యాక వారికి ఉపాధి ఎలా? అనే అంశంపై సీఎం, గవర్నర్ అడిగారని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. 70 మంది ఖైదీలకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పించామన్నారు. శిక్షకాలంలో ఇస్తున్న జీతం కంటే.. ఎక్కువ జీతం ఇస్తున్నామని తెలిపారు. ముగ్గురు మహిళా ఖైదీలకు జైళ్ల శాఖ స్టోర్లలో ఉద్యోగాలిచ్చామని డీజీ తెలిపారు. ఇప్పటి వరకు విడుదలైన ఖైదీలలో మూడో వంతు ఖైదీలకు ఉపాధి కల్పించామని వివరించారు.


అంతేకాదు.. జైలు నుంచి విడుదలయ్యాక ఉపాధి దొరక్కపోతే ఖైదీలు తమను సంప్రదించొచ్చని.. ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. కొంతమంది మహిళా ఖైదీలు తమకు కుట్టు మిషన్ ఇస్తే ఉపాధి పొందుతామని అడిగారన్నారు. అడిగిన వారందరికీ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విడుదలైన ఖైదీలు మంచి పౌరులుగా ఉండి సమాజ సేవలో పాలుపంచుకోవాలని సూచించారు డీజీ.


విడుదలవుతున్న ఖైదీల పట్ల కుటుంబం, సమాజం సానుభూతితో ఉండాలని డీజీ కోరారు. విడుదలవుతున్న ఖైదీలకు ఇదే ఆఖరి అవకాశం అని సున్నితంగా హెచ్చరించారు కూడా. అలాగే జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలకు తమ స్వగ్రామాలకు వెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించామన్నారు.


విడుదలైన ఖైదీలు పాటించాల్సిన రూల్స్ ఇవే..!


విడుదలైన ఖైదీలకు జైలు అధికారులు కొన్ని రూల్స్ పెట్టారు. ప్రతి ఖైదీ బయటకు వెళ్లిన తర్వాత శాంతియుతంగా సత్ప్రవర్తన కలిగి ఉంటానని.. లేదంటే తిరిగి శిక్ష అనుభవిస్తానని చెప్తూ.. రూ.50 వేలకు వ్యక్తిగత పూచికత్తుతో బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో విధించిన శిక్షాకాలం పూర్తయ్యే వరకు.. ప్రతి 3 నెలలకు ఒకసారి వారి గ్రామ పరిధిలోని పోలీస్ స్టేషన్‎లో హాజరుకావల్సి ఉంటుంది. మళ్లీ ఏదైనా నేరం చేస్తే రద్దు చేసిన శిక్ష తిరిగి అమలు చేస్తారు. జిల్లా అధికారి సదరు ఖైదీని గమనిస్తూ ఉండడంతో పాటు.. ఆ ఖైదీ విడుదలైన జైలుకు ఆరు నెలలకోసారి రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది.


జైళ్ళ వారీగా విడుదల అవుతున్న ఖైదీల వివరాలు..


చర్లపల్లి కేంద్ర కార్యాలయం- 61


హైదరాబాద్ కేంద్ర కారాగారం- 27


వరంగల్ కేంద్ర కారాగారం -20


చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు- 31


మహిళల ప్రత్యేక కారాగారం -35


సంగారెడ్డి కేంద్ర కారాగారం-1


నిజామాబాద్ కేంద్ర కారాగారం- 15


మహబూబ్‌నగర్ జిల్లా జైలు- 2


నల్గొండ జిల్లా జైలు- 4


ఆదిలాబాద్ జిల్లా జైలు- 3


కరీంనగర్ జిల్లా జైలు- 7


ఖమ్మం జిల్లా జైలు- 4


ఆసీఫాబాద్ స్పెషల్ సబ్ జైలు- 3






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa