ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాళ్లే లక్ష్యంగా 'ఆపరేషన్ ముస్కాన్-10'.. సరికొత్త టెక్నాలజీతో రంగంలోకి పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 03, 2024, 07:39 PM

సంతోషంగా చదువుకుంటూ ఆటపాటలతో సాగాల్సిన చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తున్న బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి పిలుపునిచ్చారు. నేరేడ్ మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ పదో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించడంతో పాటు భిక్షాటన, బాలకార్మికులు, మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీ మొదలైన వాటిలో చిక్కుకున్న చిన్నారులను రక్షించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-10 పనితీరుపై చర్చించారు.


ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. సమాజంలో బాలకార్మిక వ్యవస్థ ఒక వ్యాధిలాగా మారిందని, అది ఎంతో మంది అమాయక పిల్లల బాల్యాన్ని నాశనం చేస్తోందని పేర్కొన్నారు. ప్రధానంగా తల్లిదండ్రుల పేదరికం వల్ల పిల్లలు వెట్టిచాకిరీ కోరల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, తమ పిల్లలను మాత్రం వెట్టిచాకిరీ కూపంలోకి నెట్టకూడదని, పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఉచితంగా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలనలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని, ప్రజలు కూడా దాన్ని తమ నైతిక బాధ్యతగా భావించాలని తరుణ్ జోషి పిలుపునిచ్చారు.


రాచకొండ పరిధిలో మానవ అక్రమ రవాణా, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా మీద ఉక్కు పాదం మోపుతున్నామని, ప్రత్యేక బృందాల ద్వారా ఎంతో మందిని రక్షించామని, కేసులు నమోదు చేశామని తెలిపారు. "ఆపరేషన్ ముస్కాన్-10" ద్వారా నిరాశ్రయులైన పిల్లలతో పాటు భిక్షాటనలో చిక్కుకున్న పిల్లలు, బాలకార్మికులను రక్షించి.. పునరావాసం కల్పించడమే లక్ష్యంగా 1 జూలై 2024 నుంచి 31 జూలై 2024 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు. ఇందుకోసం ఒక ఎస్ఐ, నలుగురు పోలీసు కానిస్టేబుల్‌లు ఉండేలా (ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్‌తో సహా) ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.


ఈ బృందాలు అక్రమ రవాణాలో చిక్కుకున్న పిల్లలను రక్షించి పునరావాసం కల్పిస్తాయి. వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుండి విడిపోయిన లేదా తప్పిపోయిన పిల్లలను గుర్తించడానికి "దర్పన్" అనే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఒడిషా, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇటుక బట్టి కార్మికుల పిల్లలు విద్యకు దూరం కాకూడదు అని వారి నివాస ప్రాంతంలోనే వర్క్ సైట్ పాఠశాలలను నడుపుతున్న విషయం గుర్తుచేశారు.


ఈ కార్యక్రమంలో డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, ఏసీపీ వెంకటేశం, రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారిణి పద్మజా రమణి, మేడ్చల్ జిల్లా సంక్షేమ అధికారి కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యుసీ ఛైర్ పర్సన్ నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా సీడబ్ల్యుసీ ఛైర్ పర్సన్ రాజా రెడ్డి, యాదాద్రి సీడబ్ల్యూసీ ఛైర్ పర్సన్ జయశ్రీ, మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రఘునాథ్ స్వామి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల డీసీపీఓలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa