తెలంగాణలో మళ్లీ వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులపైకి గుంపులు గుంపులుగా ఎగబడిపోతున్నాయి. ఇటీవలే.. హైదరాబాద్ ఫిల్మ్నగర్లో ఒంటరిగా వెళ్తున్న మహిలపైకి ఏకంగా 10 నుంచి 15 కుక్కలు ఒకేసారి ఎగబడి దాడి చేయగా.. పటాన్ చెరులో శునకాల దాడిలో చిన్నారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనలు మరవక ముందే.. మరో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 12వ వార్డు శ్రీనగర్ కాలనీలో ఓ బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో బాలుడిపైకి ఒక్కసారిగా ఆరు వీధి కుక్కలు ఎగబడ్డాయి.
బాలుడి అరుపులు కేకలు విన్న స్థానికులు.. వెంటనే బయటికి వచ్చి చూడగా.. చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి కనిపించారు. వెంటనే రాళ్లలో కొట్టి కుక్కలను తరిమేశారు. అయితే.. అప్పటికే ఆ కుక్కలు చిన్నారి ఒళ్లంతా రక్కేశాయి. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుస దాడులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పిల్లల్ని బయటకు పంపించాటానికే కాదు.. పెద్దోళ్లు ఒంటరిగా వెళ్లటానికి కూడా వణికిపోతున్నారు. అయితే.. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీ విడుదల కాగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. చిన్నారులను ఒంటరిగా బయటికి పంపొద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. మరోవైపు.. అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దాడి జరిగినప్పుడే.. హాడావుడి చేసి.. ఆ తర్వాత పట్టించుకోరంటూ తిట్ల దండకాలు అందుకుంటున్నారు.
కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్
ఇక ఇదే సమయంలో.. కుక్కల దాడులపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గతేడాది అంబర్పేట్కు చెందిన ప్రదీప్ అనే బాలుడు వీధి కుక్కల బారిన పడి మృతి చెందిన విషయం తెలిసందే. కాగా.. పటాన్ చెరులో ఆరేళ్ల బాలుడు మృతి చెందగా.. ఈ కుక్కల బెడదను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా కుక్కల దాడులను ఆపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశ్నించింది. ఒక ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని హైకోర్టు మండిపడింది. ఒకవేళ తగిన జాగ్రత్తలు తీసుకొని అన్ని వీధి కుక్కలకు వ్యాక్సిన్ చేయించి ఉంటే మరో ప్రాణం బలి అయ్యేది కాదని అధికారులకు హైకోర్టు చురకలంటించింది.
రాష్ట్రంలో మొత్తం ఎన్ని వీధి కుక్కలున్నాయి..? వాటిలో ఎన్నింటికి వ్యాక్సినేషన్ చేయించారని హైకోర్టు ప్రశ్నించింది. అనిమల్ వెల్ఫేర్ బోర్డు ఇప్పటివరకు ఏం చేసిందో తెలపాలని ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవటం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ తగు చర్యలు తీసుకుంటే మరో బాలుడు చనిపోయేవాడు కాదని తెలిపింది. వీధి కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను ఎంత వరకు పాటిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో జులై 10న నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులను హైకోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa