ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి నుంచి మారనున్న లెక్కలు.. మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్త రూల్స్

business |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 11:17 PM

దేశీయ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ రంగంలో కీలక మార్పులు వస్తున్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 2026లో కీలక సంస్కరణలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మూడు దశాబ్దాల క్రితం నాటి 1996 నిబంధనల స్థానంలో సరికొత్త సెబీ (మ్యూచువల్ ఫండ్స్) రెగ్యులేషన్స్ 2026 తీసుకొస్తోంది. ఈ మార్పుల వల్ల ఇన్వెస్టర్లకు మేలు కలుగుతుందని సెబీ చెబుతోంది. ప్రధానంగా పారదర్శకత ఉంటుందని తెలిపింది. మరి 2026లో వచ్చే కొత్త మార్పులకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.


కొత్త నిబంధనల్లో ప్రధానంగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు వసూలు చేసే టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో ఇప్పుడు మూడు విభాగాలుగా మారనుంది అందులో ఒకటి బేస్ ఎక్స్‌పెన్స్ రేషియో. ఇది ఫండ్ నిర్వహణకు అయ్యే అసలు ఖర్చుగా పేర్కొంటారు. ఇక రెండోది బ్రోకరేజ్. లావాదేవీల అమలు కోసం చెల్లించే రుసుముగా చెబుతారు. ఇక మూడోది చట్టబద్ధమైన పన్నులు. ఇందులో జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, ఎక్స్ఛేంజ్ ఫీజులు, సెబీ ఛార్జీలు ఉంటాయి.


 అయితే గతంలో ఇవన్నీ ఒకటిగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్లు తాము దేనికోసం ఎంత చెల్లిస్తున్నారో స్పష్టంగా తెలుసుకునేలా చేసేందుకు మూడు విభాగాలుగా విభజించినట్లు సెబీ పేర్కొంది. దీనివల్ల ఖర్చులు 5 నుంచి 7 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని చెబుతోంది. కానీ ఇన్వెస్టర్లకు పెద్దగా మిగిలేది ఏమీ ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2025 ఏడాది ఇన్వెస్టర్లకు ఎన్నో సవాళ్లు విసిరింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు, భౌగోళిక అనిశ్చితుల వంటి ముఖ్యమైన అంశాలు దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.


మార్కెట్ ఎప్పుడూ ఒడుదొడుకులను ఎదుర్కొంటుంది. బుల్, బేర్ మార్కెట్లు సహజం. ఈ విషయాన్ని గ్రహించి దీర్ఘకాలిక లక్ష్యాలతో పెట్టుబడులు పెట్టాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో మంచి లాభాలు అందుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. కేవలం మార్కెట్ పెరిగినప్పుడు పెట్టుబడి పెట్టకుండా, బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీలు ఎంచుకోవాలంటున్నారు. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్స్ పడిపోతే లార్జ్ క్యాప్ కంపెనీలు నిలకడగా ఉంటాయని 2025లోనే నిరూపితమైందంటున్నారు.


అలాగే పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని నగదు రూపకంగా ఉంచుకోవాలి. మార్కెట్ పడినప్పుడు మంచి షేర్లను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌తో విడదీయలేని విధంగా ముడిపడి ఉంది. కాబట్టి అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా మనించాలి. అయితే, సెబీ కొత్త రూల్స్ మ్యూచువల్ ఫండ్ రంగాన్ని మరింత జవాబుదారీగా మారుస్తుందని చెబుతున్నారు. ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానాన్ని అలవర్చుకుంటే 2026లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa