ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైట్ చూపిస్తామని తీసుకెళ్లి.. కారులోనే 4 గంటల పాటు.. యువతిపై రియల్ ఎస్టేట్ కంపెనీ ఉద్యోగుల అఘాయిత్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 03, 2024, 07:58 PM

ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న యువతిపై అదే కంపెనీలో పని చేస్తున్న మరో ఇద్దరు సీనియర్లు.. సైట్ చూపిస్తామని నమ్మించి తీసుకెళ్లి.. అత్యాచారానికి యత్నించిన దారుణమైన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. మంగళవారం రోజున రాత్రి.. ఉప్పల్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. జరిగిన విషయం చెప్పగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని కడపకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం గత నెలలో హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్‌లో నివాసముంటోంది. అయితే.. నగరంలోని మియాపూర్‌లో ఉన్న ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇటీవలే సేల్స్ డిపార్ట్ మెంట్‌లో ట్రైనీగా చేరింది. కాగా.. అదే రియల్‌ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌‌లుగా సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు.


బాధితురాలు కొత్తగా జాయిన్ కావటంతో.. ఆమెకు వర్క్ నేర్పిస్తున్నట్టుగా కవరింగ్ ఇస్తూ అమ్మాయిని బుట్టలో వేసుకోవాలని ప్రయత్నించారు. వాళ్లు నిజంగానే ఫ్రెండ్లీగా ఉన్నారని, వర్క్ నేర్పిస్తున్నారని నమ్మిన ఆ అమ్మాయి.. వాళ్లతో కొంచెం చనువుగా ఉంది. దాన్నే అదునుగా తీసుకున్న నిందితులు.. సైట్ చూపిస్తామంటూ ఆ యువతిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. మాటల్లో పెట్టి, మత్తు మందు కలిపిన కూల్ డ్రింగ్ తాగించారు. అనంతరం యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. యాదాద్రిలో మీటింగ్ అనంతరం హైదరాబాద్‌కి వస్తుండగా కారులో రేప్ చేశారు. అయితే.. తనకు అనారోగ్యంగా ఉందని వేడుకున్నా వినకుండా 4 గంటలపాటు కారులోనే వేధింపులకు గురి చేశారు. అత్యాచారం అనంతరం బాధితురాలిని హాస్టల్ ముందు వదిలేసి వెళ్లినట్లు బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. అదే రియల్ ఎస్టేట్ కంపనీలో పని చేస్తున్న మరో ఇద్దరు సేల్స్ ఎగ్జిగ్యుటివ్ గర్ల్స్‌ని కూడా రేప్ చేస్తామన్నారని బాధితురాలు చెప్పింది. తనతో పాటు పని చేసే మరో ఇద్దరు అమ్మాయిలను కూడా ఇలాగే చేస్తామని తనతో చెప్పినట్టు భాదితురాలు పోలీసులకు వివరించింది.


బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేసి.. అక్కడి నుంచి మియాపూర్‌కు పంపించారు. అత్యాచార ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. సదరు రియల్ ఎస్టేస్ కంపెనీ వైస్ ఛైర్మన్ సంగారెడ్డి, ఉద్యోగి జనార్ధన్‌లను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.


ఉద్యోగం కోసం ఎక్కడెక్కడి నుంచో అమ్మాయిలు హైదరాబాద్‌కు వస్తుంటారు. కష్టపడి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు తెచ్చుకోగా.. అక్కడ కొందరు కామాంధులు వాళ్లపై కన్నేసి.. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా.. ఇప్పటికీ కొంత మంది తల్లిదండ్రులు.. తమ కూతుళ్లను హైదరాబాద్‌లాంటి నగరాలకు ఉద్యోగానికో, చదువుకోటానికి పంపించేందుకు భయపడుతున్నారు. పోలీసులు ఎంత భరోసా కల్పించినా.. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, న్యాయస్థానాలు ఎంతటి కఠిన శిక్షలు విధించినా.. అలాంటి తల్లిదండ్రులకు ధైర్యం ఇవ్వలేకపోవటానికి కారణం.. ఇలాంటి ఘటనలే అని అభిప్రాయపడుతున్నారు సామాన్యులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa