ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గువాహటిలో శ్రీవారి ఆలయం.. 25 ఎకరాలు కేటాయించిన అస్సాం ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 09:32 PM

దేశంలోని ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించిన సంగతి తెలిసిందే. ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం ఉండాలని టీటీడీతో పాటుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బిహార్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వం టీటీడీకి భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రాష్ట్రం శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం భూములు కేటాయించింది. అస్సాంలోని గువాహటిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం అస్సాం ప్రభుత్వం భూమి కేటాయించింది. మొదట నిర్ణయించిన10.8 ఎకరాల భూమికి బదులుగా శ్రీవారి ఆలయం కోసం 25 ఎకరాల భూమిని కేటాయిస్తూ అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి, అస్సాం సీఎంల మధ్య సంప్రదింపుల తర్వాత అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.


మరోవైపు గువాహటి సమీపంలోని కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం 10.8 ఎకరాల భూమి కేటాయించేందుకు అస్సాం ప్రభుత్వం గతంలోనే అంగీకరించింది. అయితే డిసెంబర్ నెలలో అస్సాం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ద్వివేది.. టీటీడీకి ఓ లేఖ రాశారు. గువాహటిలోని గర్చుక్‌లో ఇప్పటికే శ్రీవారి ఆలయం ఉందని.. ఇప్పుడు కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో శ్రీవారి ఆలయం నిర్మిస్తే.. గర్చుక్‌లోని ఆలయ ప్రయోజనాలకు భంగం కలిగే అవకాశం ఉందని.. ఆలయ నిర్వాహకుల అభిప్రాయపడుతున్నారని టీటీడీకి వివరించారు. ఈ నేపథ్యంలో టీటీడీ.. శ్రీవారి ఆలయాన్ని సిల్చార్ లేదా డిబ్రూగఢ్‌లలో ఏర్పాటు చేయాలని సూచించారు.


ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు లేఖ రాసిన చంద్రబాబు.. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు చేపడుతున్న చర్యలు.. హిందూ సనాతన ధర్మం విస్తరణకు ఏపీ ప్రభుత్వం, టీటీడీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే అమరావతిలో 25 ఎకరాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్న సంగతిని వివరించారు. ఈ క్రమంలోనే గువాహటిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 25 ఎకరాల భూమి కేటాయించాలని చంద్రబాబు కోరారు.


ఈశాన్య భారతదేశానికి గువాహటి కేంద్రంగా ఉన్న నేపథ్యంలో, భక్తుల సౌకర్యాలు, నిత్యాన్నదానం వంటి కార్యక్రమాలతో ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి 25 ఎకరాల భూమిని కేటాయించాలని చంద్రబాబు సిఫార్సు చేశారు. చంద్రబాబు విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అస్సాం సీఎం.. గువాహటిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం టీటీడీకి 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. అలాగే ఈ ప్రాజెక్టు కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అంగీకరించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa