దేశంలోని వైద్య, దంత వైద్య విద్యలో జవాబుదారీతనాన్ని పెంచే దిశగా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రవేశ నిబంధనలను తుంగలో తొక్కి.. ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు చేపట్టిన రాజస్థాన్లోని పది ప్రైవేట్ డెంటల్ కళాశాలలపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు గానూ ఒక్కో కళాశాలకు రూ. 10 కోట్ల చొప్పున మొత్తం రూ. 100 కోట్ల భారీ జరిమానా విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
అసలీ కేసు నేపథ్యం ఏమిటి?
రాజస్థాన్లోని కొన్ని ప్రైవేట్ డెంటల్ కాలేజీలు నీట్ నిబంధనలను, మెరిట్ జాబితాను పక్కనబెట్టి.. అనర్హులకు ప్రవేశాలు కల్పించాయనే ఆరోపణలపై సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతోంది. నిర్ణీత కౌన్సెలింగ్ ప్రక్రియను అనుసరించకుండా, కేవలం లాభాపేక్షతోనే ఈ అడ్మిషన్లు జరిగాయని న్యాయస్థానం నిర్ధారించింది. విద్యాసంస్థలు ఎప్పుడూ వ్యాపార కేంద్రాలుగా మారకూడదని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రతి కళాశాల రూ. 10 కోట్ల జరిమానాను నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు చెల్లించాలని స్పష్టం చేసింది.
అంతేకాకుండా అక్రమ మార్గాల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల విషయంలో కూడా కోర్టు కఠినంగా వ్యవహరించింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC), డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI)ను ఆదేశించింది. ఈ జరిమానా ద్వారా వసూలైన నిధులను రాష్ట్రంలోని వైద్య మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం లేదా పేద విద్యార్థుల విద్య కోసం వినియోగించాలని కోర్టు సూచించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల్లో వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా మేనేజ్మెంట్ కోటా పేరుతో అక్రమాలకు పాల్పడే సంస్థలకు ఇది గట్టి దెబ్బగా నిలుస్తోంది.
కేవలం రాజస్థాన్కే పరిమితం కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని వైద్య, దంత వైద్య కళాశాలలు ప్రవేశాల విషయంలో పారదర్శకత పాటించాల్సిందేనని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. విద్యా వ్యవస్థలో మెరిట్కు ప్రాధాన్యత ఇవ్వాలని, ధనబలంతో సీట్లు పొందే సంస్కృతిని అరికట్టాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa