ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఫ్రీ బస్సు లేదు.. ఏం లేదు'.. కుటుంబాన్ని నిర్ధాక్షిణ్యంగా దింపేసిన మహిళా కండక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 03, 2024, 08:02 PM

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండో రోజే అమల్లోకి తీసుకొచ్చిన పథకం మహాలక్ష్మి. ఈ పథకం కింద.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ప్రభుత్వం. అయితే.. ఈ పథకం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు రోజూ.. ఏదో ఓ విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొదట్లో ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు దాడి చేయటం.. ఆ తర్వాత సీట్ల కోసం మహిళా ప్రయాణికులు వాళ్లలో వాళ్లే దాడులు చేసుకోవటంతో చర్చనీయాంశంగా మారింది.


అయితే.. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని మహిళలు వందకు వంద శాతం వినియోగించుకుంటున్న క్రమంలో.. బస్సులన్ని ఫుల్ అయిపోతున్నాయి. నిలబడేందుకు కూడా చోటు లేనంతగా.. పరిమితికి మించి బస్సులను నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే.. టీజీఎస్ ఆర్టీసీ రికార్డులు కూడా బద్దలు కొట్టేసింది. 100 శాతం కాదు.. 120 శాతం కూడా ఆక్యుపెన్సీతో.. రోజుకు 20 లక్షల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. అయితే.. ఇందులో 70 శాతం మహిళలే ఉండటం గమనార్హం. బస్సుల్లో సింహభాగం మహిళలే ఎక్కుతుండటంతో.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ మిగతా ప్రయాణికులు కూడా గోడు వెల్లబోసుకుంటున్న వీడియోలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


అవసరం ఉన్నా లేకపోయినా మహిళలు ప్రయాణాలు సాగిస్తుండటం.. మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా చేస్తుండటంతో.. ఆర్టీసీ సిబ్బంది కూడా సహనం కోల్పోతున్న సందర్భాలు చాలానే కన్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. సహనం కోల్పోయిన ఓ మహిళా కండక్టర్.. ఓ కుటుంబాన్ని బస్సు ఎక్కకుండా నిర్ధాక్షిణ్యంగా దింపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం బస్ స్టాండ్‌లో జగిత్యాల బస్సు ఎక్కుతున్న సమయంలో.. మహిళా కండక్టర్ వారిని మెట్ల దగ్గరే ఆపేసింది. ఉచిత ప్రయాణం లేదు.. ఏం లేదు.. ముందు చెకింగ్ ఉంది.. వాళ్లు చూస్తే రూ.500 జరిమానా విధిస్తారు.. అంటూ సదరు కుటుంబ సభ్యులను భయపెట్టి.. బలవంతంగా కిందికి దింపేసింది. అయితే.. ఆ కండక్టర్ వాళ్లను.. బస్సు ఫుల్ అయినందుకు దింపేసిందా.. లేదా ఇంకేదైనా కారణం వల్ల దింపేసిందా అన్నది మాత్రం క్లారిటీ లేదు.


ఒకవేళ నిజంగానే బస్ ఫుల్ అయ్యుంటే.. అదే కారణం చెప్పి దింపేయాలి.. కానీ ఇలా ఫ్రీ బస్సు సౌకర్యం లేదు అంటూ.. జనాలను తప్పుదోవ పట్టించటం ఎందుకు అంటూ నెటిజన్లు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జనాలు మరీ గొర్రెల్లా తయారవుతున్నారని.. బస్సు ఫుల్ అయిందని తెలిసి కూడా.. అదే బస్సు ఎక్కి మిగతా ప్రయాణికులను ఇబ్బంది పెట్టటమెందుకు.. ఇంకో బస్సు ఎక్కి పోవొచ్చుగా.. ఇలా చేస్తే ఆ కండక్టర్లకు కోపం రాకుండా ఎలా ఉంటుందని అని వాళ్లకు మద్దతు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa