ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బర్రెలక్క అరెస్ట్.. బాహుబలి రేంజ్‌లో టీజీఎస్పీఎస్సీకి రక్షణ కవచం.. కనిపించినోళ్లందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 04:50 PM

హైదరాబాద్‌లోని టీజీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగ యాత్ర పేరుతో తెలంగణ నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పికెటింగ్‌లు నిర్వహించగా.. టీజీఎస్పీఎస్సీ కార్యాలయం గేటు ముందు బాహుబలి సినిమాలో యుద్ధం సమయంలో ఏర్పాటు చేసిన.. రక్షణ కవచాన్ని తలపించేలా.. భారీ బారేకేడ్లు ఏర్పాటు చేయటం గమనార్హం. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో కూడా తనిఖీలు చేపట్టారు.


ఈ క్రమంలో.. ముట్టడికి యత్నించిన యువతను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. టీజీఎస్పీఎస్సీ కార్యాలయానికి పెద్ద ఎత్తున యువత చేరుకుని ఆందోళన నిర్వహించగా.. పోలీసులు వాళ్లందరిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కేవలం టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు వచ్చిన యువతను మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నిరుద్యోగ జేఏసీ, బీజేవైఎం నేతలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.


ఈ క్రమంలోనే.. నిరుద్యోగుల ముట్టడికి మద్దతు తెలిపుతూ.. టీజీఎస్పీఎస్సీ కార్యాలయానికి తన భర్తతో కలిసి వచ్చిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. ముట్టడి నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం కూడా ప్రదర్శించారు. ఆ రోడ్డు వెంట ఎవరొచ్చినా వాళ్లు ముట్టడికి యత్నిస్తున్నారేమోనని.. అదుపులోకి తీసుకుని.. పోలీసు వాహనాలు ఎక్కించటమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే.. ఓ భార్యభర్తల జంటను ఆపేసి, ఫోన్లు లాక్కున్నారు. దీంతో.. తాము సాధారణంగా రోడ్డు వెంట వెళ్తున్నామని, ఆందోళన చేయటానికి రాలేదంటూ ఆ జంట ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. అక్కడి నుంచి పంపించేశారు.


మరోవైపు.. అదే రోడ్డు వెంట వెళ్తున్న రైతులు, సాధారణ ప్రజలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవటం గమనార్హం. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఒక రైతు, ఒక లాయర్, ఆఫీసుకు వెళ్తున్న ఒక ఉద్యోగి ఉండగా.. వారిని పోలీస్ వాహనాలు ఎక్కించారు. మేము ఆందోళనకారులం కాదు బాబోయ్ అని ఎంత మొత్తుకున్నా వినకపోవటంతో.. పోలీసులు మీదికి సీరియస్ అయ్యారు. దీంతో.. ఉన్నతాధికారులు కల్పించుకుని వాళ్లను వదిలిపెట్టారు.


ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రజా పాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం రోడ్డు మీద స్వేచ్ఛగా నడిచే హక్కు కూడా లేదా అంటూ వాపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa