మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు వరుస షాక్లు కొనసాగుతున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ కేసీఆర్కు.. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు బీఆర్ఎస్ విలవిలలాడుతోంది. కాంగ్రెస్లోకి బీఆర్ఎష్ వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా, బీఆర్ఎస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, బస్వరాజ్ సారయ్య, దండె విఠల్, ఎం.ఎస్. ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రాగానే.. అర్ధరాత్రి ఆయన నివాసంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. దండే విటల్ -ఆదిలాబాద్ లోకల్ బాడీ, భాను ప్రసాద్ -కరీంనగర్ లోకల్ బాడీ, ఎమ్మెస్ ప్రభాకర్ -రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీ.. బొగ్గవరపు దయానంద్- గవర్నర్ కోటా, ఎగ్గే మల్లేషం-ఎమ్మెల్యే కోటా, బస్వరాజ్ సారయ్య- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. శుక్రవారం అమావాస్య కావడంతో గురువారం రాత్రే వీళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది.
ఇటీవలే మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బీఆర్ఎస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరినట్లు అయింది. మరికొందరు కూడా బీఆర్ఎస్ను వీడుతారనే ప్రచారం జరుగుతోంది. మహబూబ్నగర్కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు తన నిర్ణయం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తల అభిప్రాయంతో చేరికపై నిర్ణయం తీసుకుంటానని బండ్ల కృష్ణమోహన్రెడ్డి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. ముచ్చటగా మూడోసారి అధికారం చేపడతామనే ధీమాతో ఉన్న కేసీఆర్కు మింగుడు ఫలితాలు వచ్చాయి. ఇక, లోక్సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టకుంది. మొత్తం 17 స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత గత 24 ఏళ్లలో ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కించుకోకపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సీనియర్ నేత కే కేశవరావు కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa