ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాహసానికి దక్కిన అరుదైన గౌరవం,,,తెలంగాణ హెడ్‌కానిస్టేబుల్‌కు ప్రెసిడెంట్ మెడల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2024, 09:28 PM

తెలంగాణ పోలీసులకు అవార్డుల పంట పండింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రెసిడెంట్ మెడల్స్, గ్యాలంటరీ అవార్డులు ప్రకటించగా.. దేశవ్యాప్తంగా మొత్తం 1037 మందిని ఈ అవార్డులు వరించాయి. ఈ మేరకు అవార్డు పొందిన వారి పేర్లతో జాబితాను విడుదల చేసింది. అయితే.. ఈ క్రమంలోనే తెలంగాణలోని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్, డిఫెన్స్ డిపార్ట్‌మెంట్లలో ఉత్తమ సేవలను అందించిన వారిని ఈ అవార్డు‌లు వరించాయి. ఈ మేరకు రాష్ట్ర పోలీసులకు మొత్తం 21 మెడల్స్ లభించటం విశేషం.


కాగా.. ఇందులో భాగంగా తెలంగాణ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు దక్కింది. ప్రాణాలకు తెగించి యాదయ్య చేసిన సాహసానికి, వృత్తిపట్ల ఆయన చూపిన నిబద్ధతకుగానూ అరుదైన గుర్తింపు లభించటం అభినందనీయం. మరోవైపు.. అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌, డీసీపీ కటకం మురళీధర్ అందించిన విశిష్ట సేవలకు గానూ.. ప్రెసిడెంట్ మెడల్‌కు ఎంపికయ్యారు.


అదేవిధంగా.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి, కమాండెంట్ జమీల్ బాషా, అదనపు ఎన్పీ పి.కృష్ణమూర్తి, ఎస్సై కే.రాము, ఎస్సై అబ్దుల్ రఫీక్, ఎస్సై ఇక్రమ్ అబ్‌ఖాన్, ఎస్సై శ్రీనివాస్ మిశ్రా, ఎస్సై కే.బాలకృష్ణయ్య, ఎస్సై ఏ.లక్ష్మయ్య, ఎస్సై జి.వెంకటేశ్వర్లు, ఇన్‌‍స్పెక్టర్ నూతలపాటి జ్ఞాన సుందరిని.. మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్‌ వరించాయి. మెడల్ ఫర్ గ్యాల్లాంటరీ అవార్డుకు ఎస్పీ సునీల్ దత్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మోర కుమార్, రిజర్వ్ ఎస్సై శనిగరపు సంతోష్, జూనియర్ కమాండో ఏ.సురేష్, జూనియర్ కమాండో వి.వంశీ, జూనియర్ కమాండో కంపాటి ఉపేందర్, జూనియర్ కమాండో పాయం రమేష్ ఎంపికయ్యారు.


రాష్ట్రంలో ఇషాన్‌ నిరంజన్‌ నీలంపల్లి, రాహుల్‌ అనే దుండగులు చైన్‌ స్నాచింగ్‌లు, అక్రమ ఆయుధాల సరఫరా చేసేవారు. అయితే వీళ్లిద్దరూ జూన్‌ 25,2022న ఓ దోపిడీకి పాల్పడ్డారు. ఈ దోపిడీకి సంబంధించిన సమాచారం అందుకున్న సైబరాబాద్‌ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్య.. చాకచక్యంగా వాళ్లిద్దరినీ పట్టుకున్నారు. అయితే.. యాదయ్య నుంచి తప్పించునేందుకు నిందితులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో యాదయ్యపై దారుణంగా కత్తితో పలుమార్లు దాడి చేశారు. అయినప్పటికీ యాదయ్య వెనక్కి తగ్గలేదు. ప్రాణాల్ని ఫణంగా పెట్టి మరీ నిందితుల్ని పట్టుకుని.. కటకటాల్లోకి పంపించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యాదయ్య 17 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రాణాలకు తెగించి పోరాడిన ఆయన ధైర్య సాహసాల్ని కేంద్రం కొనియాడింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్యాలంటరీ అవార్డును ప్రధానం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa