ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ రాజ్యసభ స్థానానికి,,,,కే కేశవరావు స్థానంలో అభిషేక్ సింఘ్వీకి అవకాశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2024, 09:38 PM

కాంగ్రెస్‌ రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ నేత కే కేశవరావు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరటంతో పాటు.. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ఆ స్థానం ఖాళీ కాగా.. ఈరోజు తెలంగాణ సహా పలు రాష్ట్రాల రాజ్యసభ సభ్యుల ఉపఎన్నికలకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే.. కేకే స్థానంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎవరు వెళ్లనున్నరన్న ఉత్కంఠకు తెర దించుతూ.. ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీని పంపనున్నట్లు కాంగ్రెస్ పార్టీ యాజమాన్యం ప్రకటించింది.


అభిషేక్ మను సింఘ్వీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కాగా.. 2006 నుంచి రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హస్తం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో.. తెలంగాణ రాజకీయాల్లో మను సింఘ్వీ తనదైన పాత్ర పోషించటం గమనార్హం. అయితే.. ఈ ఎంపీ స్థానానికి మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉన్నందున.. సింఘ్వీకి రాజ్యసభ సీటు దక్కటమనేది.. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలంపై ఆధారపడి ఉంటుంది. ఎలాగూ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండటంతో.. ఈ సీటును తామే గెలుచుకుని, రాజ్యసభలో తమ బలాన్ని 27కు పెంచుకుంటామన్న ధీమాలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది.


అయితే.. తొమ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నారు. ఈ 12 రాజ్యసభ స్థానాల ఉపఎన్నిక‌ల‌కు గానూ ఆగ‌స్టు 14న నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఆగస్టు 21 వరకు నామినేష‌న్లు వేయడానికి చివ‌రి గడువు. మ‌హారాష్ట్ర, అస్సాం, మ‌ధ్యప్రదేశ్‌, మ‌హారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాల‌కు చెందిన అభ్యర్థులు ఆగస్టు 26 లోపు, బీహార్, ఒడిశా, హ‌ర్యానా, రాజ‌స్థాన్ తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన అభ్యర్థులు 27లోపు నామినేష‌న్లను ఉప‌సంహ‌రించుకునేందుకు అవకాశం ఉంది. ఇక.. సెప్టెంబ‌ర్ 3వ తేదీన ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు రాజ్యసభ స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు సాయంత్రం 5 గంట‌ల నుంచి ఓట్ల లెక్కించనున్నారు.


అయితే.. సిట్టింగ్ సభ్యులు లోక్ సభకు ఎన్నికవటం వల్ల పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. మరోవైపు... తెలంగాణ, ఒడిశాలో కూడా ఆ స్థానాల్లోని నేతలు రాజీనామాలు చేయటంతో.. మొత్తంగా 12 స్థానాలకు ఉపఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో కే కేశవ రావు.. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరగా.. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఒడిశాలోనూ బిజూ జనతాదళ్ (బీజేడీ) ఎంపీ మమతా మొహంతా కూడా తన రాజ్యసభ సీటుతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటంతో.. ఆ స్థానం కూడా ఖాళీ అయ్యింది. దీంతో.. ఈ 12 స్థానాలకు గానూ.. సెప్టెంబరు 3వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa