కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలను మోసం చేశారని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో అర్హత కలిగిన రైతులకు రుణ మాఫీ జరగలేదని హరీశ్ విమర్శించారు. మెుత్తం మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతోందని.. కానీ రైతు రుణమాఫీకి రూ.17 వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. రూ. 14 వేల కోట్ల నిధులకు కోత పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని దుయ్యబట్టారు.
రైతు రుణమాఫీపై కాంగ్రెస్ మెుదట్నుంచి అసత్యాలే చెబుతోందని హరీష్ విమర్శించారు. తొలుత డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తామని చెప్పారని.. ఆ తర్వాత మాట మార్చి ఆగస్ట్ 15 లోపు అని చెప్పారని.. తీరా ఇప్పుడు చూస్తే పూర్తిగా రుణమాఫీ చేయకుండా అబద్దాలు ప్రచారం చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన అబద్ధపు ప్రచారాలతో రైతులను నిట్టనిలువులా ముంచారని పైరయ్యారు. ఏ ఊరుకైనా వెళ్లి రుణమాఫీ జరిగిందా? అనే అంశంపై చర్చ పెడదామని.. అందుకు సీఎం రేవంత్ సిద్దమా ? అని సవాల్ అన్నారు. చర్చకు తాము రెడీగా ఉన్నామని.. రుణమాఫీ సంపూర్ణంగా అయ్యిందంటే తాను దేనికైనా సిద్ధమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడకు చర్చకు రమ్మంటే అక్కడికి చర్చకు వచ్చేందుకు తాము సిద్ధమన్నారు.
మెుత్తం 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సింది ఉంటే.. కేవలం 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ వర్తింపజేశారన్నారు. మరో 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయకుండా ఎగనామం పెట్టారని హరీష్ తీవ్ర ఆరోపణలు చేశారు. పంచపాండవుల కథలా కాంగ్రెస్ రుణమాఫీ ఉందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తొండి చేయటంలో తోపు అని.. బూతులు తిట్టడంలో టాప్ అని ఎద్దేవా చేశారు. ఈ రెండు విషయాల్లో ఆయన్ను కొట్టేవారే లేరని అన్నారు. తొండి చేసుకుంటూ.. మెుండిగా మాట్లాడుతూ తెలంగాణ రైతులకను రేవంత్ మోసం చేశారని హరీష్ ఫైరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa