ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షమించు.. మేం నిన్ను కాపాడుకోలేకపోయాం.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 08:24 PM

తన కళ్ల ముందే తల్లిదండ్రులపై దాడి జరుగుతుంటే తట్టుకోలేక 14 ఏళ్ల కూతురు ప్రాణాలు విడిచిన హృదయవిదారక ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. "నిజంగా హృదయవిదారకమే..! గూండాలు ఇంట్లోకి ప్రవేశించి ఆమె తండ్రి సోమయ్యపై దాడి చేయడంతో 14 ఏళ్ల పల్లవి గుండె ఆగిపోయింది. ఆమె సహాయం కోసం విలపించింది. తన తండ్రిపై దాడిని చూసి తట్టుకోలేక బాధతో పల్లవి కుప్పకూలిపోయింది. భయంతో తన ప్రాణాలే కోల్పోయింది. కూతురిని ప్రేమించే ఒక తండ్రిగా.. తండ్రే హృదయంగా భావించే ఒక అమ్మాయిని రక్షించడంలో విఫలమైనందుకు నాకు బాధగా ఉంది..! ఆ అమ్మాయి కుటుంబానికి, ముఖ్యంగా తండ్రికి నా ప్రగాఢ సానుభూతి.


ప్రభుత్వానికి ఇదే మరో పెద్ద మచ్చ. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని చెప్పేందుకు ఈ హృదయవిదారక ఘటన ఒక ఉదాహరణ. క్షమించు పల్లవి.. మేం నిన్ను కాపాడుకోలేకపోయాం." అంటూ ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని.. డి.కొత్తపల్లికి చెందిన కాసం సోమయ్య కుమార్తె పల్లవి (14). కొంతకాలంగా పల్లవి అనారోగ్యానికి గురికాగా.. ఆమెకు ఇటీవలే ఆపరేషన్ చేపించారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. అయితే.. సోమయ్యకు అదే గ్రామానికి చెందిన కాసం కాశిలింగంకు మధ్య భూతగాదాల నేపథ్యంలో.. సూర్యాపేటకు షిఫ్ట్ అయిన సోమయ్య కుటుంబం.. మళ్లీ కొత్తపల్లికి వచ్చి ఉంటున్నారు.


  కాగా.. శ్రావణ మాసం నేపథ్యంలో ఆగస్టు 15న గ్రామంలో బోనాల పండుగ జరగ్గా.. కడారి సైదులు, కాసం కాశిలింగం, కడారి సోమయ్య కలిసి మద్యం తాగారు. మద్యం తాగుతున్న సమయంలో పాత కక్షలు చర్చకు రావటంతో.. మరోసారి ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలోనే.. సోమయ్య, అతని భార్య మంజులపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తన కళ్లముందే.. తల్లిదండ్రులపై దాడి జరగటం చూసి తీవ్ర భయాందోళనకు గురైన పల్లవి.. కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలింది. సోమన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa