నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేళ్తరోడ గ్రామానికి చెందిన 11 ఏళ్ల వయసున్న దుర్గ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆమె తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా.. తాజాగా తల్లి కూడా తనను ఒంటరిగా వదిలేసి ఆత్మహత్య చేసుకుంది. తల్లి చనిపోవటంతో.. ఆ 11 ఏళ్ల చిన్నారికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. బంధువులు, నా అన్నవాళ్లు ఎవరూ రాకపోవటంతో.. తల్లి మృతదేహం పక్కనే ధీనంగా ఏడుస్తూ కూర్చుంది. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేక అక్కడికి వచ్చిన వారి దగ్గర భిక్షాటన చేయటం అందరినీ కలచివేసింది.
ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారి దుర్గ పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కోమటిరెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. తానుర్ మండల తహసీల్దార్ లింగమూర్తి, ఎంపీడీవో అబ్దుల్ సమద్ ద్వారా తన తనయుడి జ్ఞాపకార్ధం నిర్వహిస్తున్న ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. చిన్నారి తను ఎంత వరకు చదివితే అంత వరకు చదివిస్తానని.. అన్ని సౌకర్యాలు కల్పించి పెళ్లి అయ్యేంత వరకు అండగా ఉంటానని దుర్గకు మాటిచ్చారు.
చిన్నారితో వీడియో కాల్ మాట్లాడిన మంత్రి కోమటి రెడ్డి.. అధైర్యపడవద్దని, నేను ఉన్నానని భరోసా కల్పించారు. తన కుమారుడి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఫాండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది పిల్లల్ని చదివిస్తున్నట్లు చెప్పారు. ఈ పాపను కూడా తన బిడ్డలాగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఏ కష్టం రాకుండా చదువుకు కావాల్సిన డబ్బులు, బట్టలు అందిస్తానని అన్నారు. చిన్నారి దుర్గ ఎవర్ని డబ్బులు అడగాల్సిన పని లేదని.. తానే అన్ని బాధ్యతలు తీసుకుంటానని అన్నారు. జిల్లా కలెక్టర్ను బేళ్తరోడ గ్రామానికి పంపించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇంటికి అవసరమైన అదనపు డబ్బులు కూడా తానే సమకూరుస్తానని చెప్పారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి మంచి మనసును ఆమె బంధువులు, గ్రామస్తులు కొనియాడుతున్నారు. పాపను ఆదుకునేందుకు దేవుడిలా ముందుకొచ్చాడని ప్రశంసిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa