తెలంగాణలో భారీ వర్షాలతో పాటు వరదలు పోటెత్తుతున్నాయి. దీంతోప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా వర్షాకాలంలో విష జ్వరాలు పంజా విసురుతాయి. ఇప్పటికే ప్రజలు చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఇప్పటికే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యూ సహా వైరల్ ఫీవర్లతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా స్వైన్ఫ్లూ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాడి. హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నాలుగు స్వైన్ ఫ్లూ కేసులను నిర్ధారించింది.
హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్న పశ్చిమబెంగాల్కు రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు(23) తీవ్ర దగ్గు తదితర లక్షణాలతో ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లాడు. అక్కడి డాక్టర్లు ఫ్లూ లక్షణాలుగా అనుమానించి నారాయణగూడ ఐపీఎంకు శాంపిల్స్ పంపించారు. ఐపీఎం అవి స్వైన్ ఫ్లూ లక్షణాలుగా నిర్ధారించింది. ఇక టోలిచౌకికి చెందిన ఓ వృద్ధుడికి(69), హైదర్నగర్ డివిజన్లోని మహిళకు(51), నిజామాబాద్ జిల్లా పిట్లం మండలానికి చెందిన మరో వ్యక్తికి(45) స్వైన్ ఫ్లూ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైంది. నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సకు వచ్చిన ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వృద్ధురాలికి(68) సైతం స్వైన్ ఫ్లూ సోకినట్లు తెలిసింది. దీంతో నగరంలో ప్రస్తుతం 5 స్వైన్ ఫ్లూ కేసులు ఉన్నాయి. స్వైన్ ఫ్లూ సోకే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
స్వైన్ ఫ్లూ లక్షణాలు ఇవే..
స్వైన్ ఫ్లూ వ్యాధి H1 N1 అనే వైరస్ మూలంగా వస్తుంది.
స్వైన్ ఫ్లూలోనూ సాధారణ ఫ్లూ జ్వరం లక్షణాలే కనిపిస్తాయి.
జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి.. స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రధాన లక్షణాలు
ముక్కు కారటం, జ్వరంతోపాటు దగ్గు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం ఉంటాయి.
కొందరికి వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి
మొదట సాధారణ జ్వరం మాదిరిగానే ప్రారంభమై.. ఆ తర్వాత లక్షణాలు తీవ్రమవుతాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
స్వైన్ ఫ్లూ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈజీగా వ్యాపిస్తుంది. ఫ్లూ బారినపడిన రోగులు దగ్గినా, తుమ్మినా వైరస్ గాలిలో కలుస్తుంది. ఆ గాలిని పీలిస్తే ఇతరులకూ ఫ్లూ సోకుతుంది. అందుకే మాస్కులు ధరించాలి.
జ్వరంతో పాటు తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం ఉంటే.. నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి.
కుటుంబ సభ్యులెవరైనా స్వైన్ ఫ్లూ బారిన పడితే మిగిలినవాళ్లు అప్రమత్తంగా ఉండాలి.
ఫ్లూ బారిన పడకుండా రోగ నిరోధకశక్తి పెంచుకోవడానికి నిత్యం ప్రయత్నం చేయాలి. జ్యూస్, పండ్లు ఎక్కువగా తీసుకుంటే.. రోగ నిరోధకశక్తి బాగా వృద్ధి చెందుతుంది.
సమతుల ఆహారం, వేళకు భోజనం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం తప్పనిసరి.
అప్పుడు వైరస్ ఒంట్లోకి ప్రవేశించినా.. మన శరీరం దాన్ని సమర్థంగా ఎదుర్కోగలుగుతుంది.
స్వైన్ ఫ్లూ రాకుండా కాపాడుకోవడానికి టీకా అందుబాటులోకి వచ్చింది. ఆరేళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవార డాక్టర్ల సలహాతో టీకా తీసుకోవటం ఉత్తమం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa