రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ఏపీ-తెలంగాణలోని చాలా ప్రాంతాలు జలమయయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో జన జీవనం స్తంభించిపోయింది. భారీ వరదతో ఊళ్లకు ఊళ్లు నీట మునిగాయి. ఇప్పటికీ చాలా కాలనీలు ముంపులోనే ఉన్నాయి. ఇళ్లు, వాకిలి కొట్టుకుపోయి కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలారు.
ఇటువంటి సమయంలో వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. మూడ్రోజల క్రితం విలయం సృష్టించిన వాయుగుండం.. అల్పపీడనంగా మారి ఇప్పటికీ ఉత్తర తెలంగాణ, దక్షిణ మధ్యప్రదేశ్పై కొనసాగుతూనే ఉంది. బంగాళాఖాతంలో ద్రోణి వాతావరణం ఉంది. అది నేటి నుంచి మరో 3 రోజులు ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. వీటి ప్రభావంతో మరో 5 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు.
నేడు ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే ఈ జిల్లాలు భారీ వర్షాలతో తీవ్ర నష్టాన్ని చవి చూడగా.. మరోసారి వర్షం హెచ్చరికలతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గతరాత్రి కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలో నేడు కూడా ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అన్నారు.
ఇక భారీ వర్షాలకు తోడుగా ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa