ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారుకు గీతలు గీశారని.. 8 మంది చిన్నారులపై కేసు.. అంతా 2-9 ఏళ్లలోపు వారే..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2024, 07:30 PM

చిన్న పిల్లలు అల్లరి చేయటం సహజం. వారు అలా అల్లరి చేసినప్పుడు కోపగించుకోకుండా ఓపికగా అలా చేయడం మంచిది కాదని తెలియజెప్పాలి. ఆ సమయంలో పిల్లల్ని దగ్గరికి తీసుకుని.. వారికి ప్రేమను పంచుతూ నమ్మకాన్ని కలిగిస్తూనే వారు సక్రమంగా లేకపోవడానికి తగిన కారణాను వివరించాలి. అల్లరి చేసిన సమయంలో వారి మానసిక స్థితిని అర్థం చేసుకుని అందుకు తగినట్లుగా పెద్దలు ప్రవర్తించాలి. అయితే ఓ కానిస్టేబుల్ చిన్న పిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. కారుకు గీతలు గీశారని.. పసి పిల్లల అని చూడకుండా వారిపై పోలీసు కేసు పెట్టాడు. 2 నుంచి 9 ఏళ్లు మధ్య వయసున్న 8 చిన్నారులపై ఎఫ్‌ఐర్ఆర్ బుక్ చేయించాడు. కానిస్టేబులు కంఫ్లైంట్ ఇచ్చాడని వెనకాముందూ ఆలోచించకుండా పోలీసులు సైతం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


వివరాల్లోకి వెళితే.. హనుమకొండ రాంనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఓ కానిస్టేబుల్ సీఐడీ విభాగంలో పనిచేస్తున్నాడు. గత జులై 7న అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ స్థలంలో చిన్నారులు ఆడుకుంటుండగా.. అక్కడే పార్క్ చేసిన కానిస్టేబుల్‌ కారుపై గీతలు పడ్డాయి. ఈ విషయాన్ని కానిస్టేబుల్‌ పిల్లలు తండ్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తన కారుకు గీతలు పెట్టారని సదరు సీఐడీ కానిస్టేబుల్ పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకొని ఫిర్యాదు చేశాడు. చిన్నారులపై కేసు పెట్టాలని ఫిర్యాదు చేశాడు.


విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు.. కారు మరమ్మతుకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. అయినా కానిస్టేబుల్ వినిపించుకోలేదు. ఆగస్టు 5న చిన్నారులపై సుబేదారి పోలీసులకు కానిస్టేబుల్ ఫిర్యాదు చేయగా.. వారు 8 మంది చిన్నారులపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైన చిన్నారులంతా 2 నుంచి తొమ్మిదేళ్లలోపు వయసు వారే ఉండటం గమనార్హం. నెలన్నర క్రితమే ఈ కేసు పెట్టినా.. విషయం బయటకు పొక్కలేదు. ఇటీవల కేసు నమోదైన పిల్లల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలవడంతో కేసు విషయం బయట పడింది.


చిన్న పిల్లలు తెలియక చేసిన తప్పును మన్నించకుండా కానిస్టేబుల్‌ కర్కశంగా తన పరపతిని ఉపయోగించి కేసులు పెట్టించారని తల్లిదండ్రులు వాపోతున్నారు. కేసు నమోదు వల్ల పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో చిన్న పిల్లలు చేసిన తప్పుకు.. కేసులు నమోదు చేయటం ఏంటని స్థానికులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల చిన్నారికి ఏది తప్పో ఏది ఒప్పో ఏం తెలుస్తుందని నిలదీస్తున్నారు. కాగా, ఈ కేసుపై సుబేదారి సీఐ స్పందించారు. ఇది తీవ్రమైన కేసు కాదని చెప్పారు. కారు యజమానికి వాహన బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి ఎఫ్‌ఐఆర్ అవసరం అవుతుందని.. అందుకోసమే ప్రాథమికంగా కేసు పెట్టినట్లు చెప్పారు. కారు దెబ్బతిన్నట్లు ఎఫ్‌ఐఆర్ లేకుండా బీమా కంపెనీలు కారు యజమానికి బీమా మొత్తాన్ని చెల్లించవని చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa