తమ పట్ల అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టారు. "ఓ మహిళనైన నా పట్ల చాలా అసహ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. చాలా ఇబ్బందికరమైన ఫొటోలు పెట్టారు. వీళ్లకు షాదీ ముబారక్ ఎవరు ఇచ్చారు?" అంటూ పోస్ట్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ ఫొటోలను పెట్టి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్ట్ అసభ్యకరరీతిలో పెట్టి, అవమానించారని సురేఖ ధ్వజమెత్తారు.ఈ పోస్టును చూశాక తాను నిన్నటి నుంచి అన్నం తినలేదని, నిద్రకూడా పోలేకపోయానన్నారు. ఈ పోస్టు పెట్టిన వారి ఇంట్లో కూడా అక్కా, చెల్లె, తల్లి ఉన్నారని, వారింట్లో ఆడపిల్లలు ఉన్నారని గుర్తించాలన్నారు.ఈ పోస్ట్ గురించి మీడియా సమావేశం నిర్వహించిన సురేఖ మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులారా, ఖబడ్దార్, అసహ్యంగా పోస్టులు పెడితే ఇక ఊరుకునేది లేదన్నారు. అధికారం పోయిందని బీఆర్ఎస్ వాళ్లు ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. ఈ పోస్ట్ చూసినప్పటి నుంచి తాను మానసిక ఆవేదనలో ఉన్నానన్నారు. ఓ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓ చెల్లికి ఇచ్చినట్లు తన మెడలో చేనేత నూలు దండ వేశారని, దీనిని తప్పుగా చిత్రీకరించడం ఏమిటని నిలదీశారు. ఈ ఫొటోపై బీఆర్ఎస్ వాళ్లు ట్రోలింగ్ చేస్తున్నారన్నారు.నీ ఇంట్లో చెల్లిని ఇలాగే అంటే ఊరుకుంటారా? పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ గారూ, ఈ ఫొటోను మీ చెల్లికి, తల్లికి చూపించు... వాళ్లు కరెక్ట్ అంటే అప్పుడు మాట్లాడు అన్నారు. ఈ ఫొటోకు సంబంధించి తాము సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇకపై సహించేది లేదన్నారు. ఇది అటవిక ప్రవర్తన అని విరుచుకుపడ్డారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని లేదంటే బట్టలిప్పి ఉరికిస్తామని హెచ్చరించారు. పదేళ్లు దోచుకున్న బలుపు ఇంకా తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa