ప్రస్తుత కాలంలో.. ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్న లక్ష్యంతో.. పగలూ రాత్రి తేడా లేకుండా.. గంటలకొద్ది సమయం కంప్యూటర్ల ముందు కూర్చొని ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా.. చిన్న వయసులోనే గుండెపోటులాంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అందుకు నిదర్శనమే.. పలు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులు గుండెపోటుతో మరణిస్తున్న వరుస ఘటనలు. గతవారం లక్నోలోని హెచ్డీఎఫ్సీ ఉద్యోగి సదాఫ్ ఫాతిమా అనే మహిళ బ్యాంకులోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తాజాగా.. ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తోన్న 40 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఆఫీసులోని వాష్రూమ్లోనే గుండెపోటుతో కుప్పకూలిన ఘటన.. ఆందోళన కలిగిస్తోంది.
గతంలో.. 60 ఏళ్లు పైబడిన వారికే గుండెపోటు వస్తుందని అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా.. అందరినీ ఈ హార్ట్ ఎటాక్ బలితీసుకుంటోంది. పని ఒత్తిడి, నిద్రలేమి, మారిన ఆహారపు అలవాట్లతో పాటు స్క్రీన్ టైం పెరుగుతుండటం కూడా చిన్న వయసులోనే గుండెపోటు వచ్చేందుకు ప్రధాన కారణమని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎ.సాయి రవిశంకర్ హెచ్చరిస్తున్నారు.
అమెరికా లాంటి దేశాల్లో సగటున 45 ఏళ్లకు గుండెపోటు వస్తుంటే.. భారతదేశంలో మాత్రం అంతకంటే పదేళ్ల ముందే.. అంటే 35 ఏళ్ల వయసులోనే వచ్చేస్తోందని.. డాక్టర్ రవిశంకర్ వివరించారు. ఇంతకుముందు రక్తపోటు, మధుమేహం, కొలెస్టరాల్ లాంటివి ప్రధాన ముప్పు కారకాలుగా ఉంటే.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని రవిశంకర్ తెలిపారు. ఎక్కువ స్క్రీన్ టైం ఉండటం కూడా గుండెపోటుకు కారణం అవుతోందని హెచ్చరించారు. దీనికితోడు ఆన్లైన్లో ఫుడ్ ఎగ్రిగేటర్ల వద్ద రోజూ ఫుడ్ ఆర్డర్లు పెట్టుకోవడం కూడా ఇందుకు దారితీస్తోందన్నారు.
"మొబైల్, ల్యాప్టాప్, టీవీ.. ఇలా ఏవైనా గానీ రోజుకు సగటున 8 నుంచి 10 గంటల వరకు చూస్తున్నారు. వీటన్నింటినీ స్క్రీన్ టైం అనే అంటారు. ఇలా ఎక్కువసేపు తెరకు అతుక్కుపోయి ఉండడం వల్ల గుండెపోటు వస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. వివిధ ఫుడ్ ఎగ్రిగేటర్ల వద్ద నుంచి పిజ్జాలు, బర్గర్లు, ఇతర మాంసాహార వంటకాలు దాదాపు రోజూ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. ఎంత పెద్ద హోటల్ నుంచి తెప్పించుకున్నా, అక్కడ వాడిన వంటనూనెలు మళ్లీ మళ్లీ వాడడం వల్ల కొలెస్టరాల్ పెరిగిపోయి గుండెపోటుకు కారణమవుతోంది. ప్రపంచంలోనే ఫుడ్ ఆర్డర్లలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది." అని డాక్టర్ రవిశంకర్ వివరించారు.
" వీటన్నింటికి తోడు.. రోజువారి జీవనశైలిలో వ్యాయామం అస్సలే ఉండడం లేదు. పని ఉన్నంతసేపు పని చేసుకోవడం, తర్వాత మొబైల్ లేదా టీవీ చూసుకోవడం, పడుకోవడంతోనే సరిపెట్టేస్తున్నారు. సగటున రోజుకు 45 నిమిషాల చొప్పున వారానికి కనీసం ఐదారు రోజుల పాటు నడక, ఇతర వ్యాయామాలు చేస్తేనే గుండె ఆరోగ్యం బాగుంటుంది. నిశ్చల జీవనశైలి వల్ల కూడా చిన్నవయసులోనే గుండెపోటు కేసులు నమోదవుతున్నాయని." అని రవిశంకర్ హెచ్చరిస్తున్నారు.
"మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం కూడా గుండెపోటుకు దారితీస్తోంది. ఉద్యోగాల పరంగా అయినా, లేదా వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల అయినా మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటోంది. దానికి తోడు రోజుకు కనీసం 7 నుంటి 8 గంటల మంచి నిద్ర ఉండాలి. అది లేకపోవడం వల్ల కూడా గుండెపోటు వస్తోంది. వీటికి సిగరెట్లు కాల్చడం, వాతావరణ కాలుష్యం లాంటివి మరింత ఎక్కువగా కారణాలు అవుతున్నాయి." అని డాక్టర్ రవిశంకర్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa