గత నెల మెుదటి వారంలో తెలంగాణలో భారీ వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదలకు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వందల ఇండ్లు నేలకూలటంతో పాటు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం రూ.10,320.72 కోట్ల నష్టం వాటిల్లిందంటూ కేంద్రానికి నివేదిక సమర్పించింది. వరదల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు సాయం చేయాలని కోరింది.
తాజాగా.. కేంద్రం వరద సాయం విడుదల చేసింది. రాష్ట్రం 10 వేల కోట్లు అడిగితే.. కేంద్రం రూ.416 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుల నష్టాలకు సంబంధించి మంగళవారం (అక్టోబర్ 1) పలు రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద సాయం నిధులు విడుదల చేసింది. తెలంగాణలో నష్ట తీవ్రత భారీగా ఉన్నట్లు గత నెలలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది.
358 గ్రామాలు నీట మునిగాయాని.. 2 లక్షల మంది ప్రత్యక్షంగా వరద బాధితులుగా మిగిలారని పేర్కొంది. రహదారులు, వంతెనలు కొట్టుకుపోయి రూ.7693.53 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొననారు. పంట పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేశాయని.. వ్యవసాయశాఖ పరిధిలో రూ.231.13 కోట్ల నష్టం జరిగినట్లు చెప్పారు. ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, కుటలు తెగి నీటిపారుదలశాఖ పరిధిలో రూ.483 కోట్లు నష్టం చోటు చేసుకున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ భారీ వర్షాలు, వరదలకు సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం బృందం అధికారులు గత నెల రాష్ట్రంలో పర్యటించారు. సీఎం రేవంత్ వారితో ప్రత్యేకంగా భేటీ నిర్వహించి జరిగిన నష్టానికి భారీ సాయాన్ని కోరారు. అయితే కేంద్రం మాత్రం అడిగిన దానికి భిన్నంగా కేవలం రూ.416 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వరద సాయంలో అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్లు కేటాయించింది. ఏపీలో కూడా వరదలకు భారీ నష్టం వాటిల్లగా.. ఆ రాష్ట్రానికి 1,036 కోట్లు కేటాయించారు. అస్సాంకు రూ.716 కోట్లు, బిహార్కు రూ.655.60 కోట్లు, గుజరాత్కు రూ.600 కోట్లు, పశ్చిమ బెంగాల్కు రూ.468 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa