ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో రూ.500 కలిపి మరీ,,,తెలంగాణ రైతులకు 48 గంటల్లోనే అకౌంట్‌లలో డబ్బులు జమ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 10:12 PM

తెలంగాణలో రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ రెండు తీపికబుర్లు చెప్పింది. ధాన్యం కోనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ఆదేశించారు.. అలాగే సన్నాల సాగుపై రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామన్నారు. వానాకాలం సీజన్‌ నుంచే ఎంఎస్‌పీకి క్వింటాకు అదనంగా రూ.500 బోనస్‌ చెల్లించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ధాన్యం డబ్బుల్ని రైతుల ఖాతాల్లో 48 గంటల్లోపే జమ చేస్తామని కీలక ప్రకటన చేశారు.


సన్న వడ్లకు బోనస్‌ ఇవ్వడం ఇదే మొదటిసారి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ధాన్యం సేకరణకు వీలుగా వేర్వేరు కొనుగోలు కేంద్రాలను, లేదంటే వేర్వేరు కాంటాలు, సన్న రకాలను ధ్రువీకరించే యంత్రాలు, సిబ్బందిని అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణలో జాగ్రత్తగా ఉండాలని.. ఎలాంటి తప్పులు, అవకతవకలు జరగడానికి వీల్లేదన్నారు. అంతేకాదు ప్రతి ధాన్యం కేంద్రానికి ఒక ప్రత్యేక నంబరు కేటాయించాలని సూచించారు. అక్కడ కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నంబరును తప్పకుండా ఉండాలని.. అంతేకాదు సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా పోలీసులు కట్టడి చేయాలని సూచించారు.


ప్రధానంగా ధాన్యం సేకరణలో తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించొద్దన్నారు ముఖ్యమంత్రి. అవసరమైతే క్రిమినల్‌ కేసులు పెట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లీ విషయంలో రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, పరిష్కరించాలని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణ శాఖ సూచనలను ప్రతి గంటకోసారి కొనుగోలు కేంద్రాలకు అందించాలన్నారు. ప్రతిరోజూ ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను పరిశీలించడంతో పాటుగా కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయో సమీక్షించాలన్నారు. అలాగే పౌరసరఫరాల విభాగంలో 24 గంటలు పనిచేసే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చే విషయంలో నిబంధనలు పాటించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. ఒకవేళ ఎవరైనా వరుసగా బకాయిలు పెడితే.. అలాంటి మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దన్నారు. మిగిలిన మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం అప్పగించాలన్నారు.


మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు 7,139 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 4,496 పీఏసీఎస్‌ కేంద్రాలు, 2,102 ఐకేపీ సెంటర్లు, 541 ఇతర కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో జిల్లాలవారీగా చూస్తే నిజామాబాద్‌లో అత్యధికంగా 480, జగిత్యాలలో 421 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సిద్దిపేటలో 417, మెదక్‌లో 387, నల్గొండలో 375, కామారెడ్డిలో 351లో.. అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 3 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే తేమ శాతం 17 శాతం దాటకూడదు. మిల్లర్లు, వ్యాపారులు 25 శాతం, ఆపై తేమ శాతం ఉన్నా కొనుగోలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa