ఉన్నత చదువులు చదివిన ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని అనుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగానికి డిమాండ్ ఏ మేరకు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోస్టులు వేలల్లో ఉంటే అభ్యర్థులు లక్షల్లో ఉంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తమ కలల ఉద్యోగం సాధించేందుకు ప్రతి నిత్యం అలుపెరుగకుండా తీవ్రంగా శ్రమిస్తారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి చదువుతుంటారు. ఇంత కష్టపడినా.. ఉద్యోగ వేటలో అందరూ సక్సెస్ కాలేకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ బట్టి ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే కాని ప్రభుత్వ ఉద్యోగం రాని పరిస్థితితులు నెలకొన్నాయి.
కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఈ చదువుల తల్లి మాత్రం ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఏదాది కాలంలోనే ఈ ఐదు ఉద్యోగాలు సాధించటం గమనార్హం. భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన మందడి నర్సిరెడ్డి, నవనీత దంపతుల కూతురు వాణి. ప్రాథమిక విద్య నుంచి 10 వరకు గ్రామంలోనే చదువుకుంది. ఇంటర్ భువనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, డిగ్రీ మరో ప్రైవేటు కళాశాలలో పూర్తి చేసింది. గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన భీమిడి శేఖర్రెడ్డితో 2007లో వాణి వివాహమైంది. పెళ్లయినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. భర్త ప్రోత్సాహంతో బీఈడీ, పీజీ పూర్తి చేశారు. కొన్నేళ్లపాటు ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా విధులు నిర్వహించారు.
తన ఇద్దరు పిల్లలను చదివిస్తూనే ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది గురుకుల పాఠశాలల ఉద్యోగాల్లో సత్తా చాటారు. తెలుగు విభాగంలో టీజీటీ, పీజీటీ, జేఎల్ ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం కీసరలోని మహాత్మాజ్యోతిరావు ఫులే గురుకుల కాలేజీలో జేఎల్గా విధుల్లో చేరారు. ఇటీవల వెలువడిన డీఎస్సీ పరీక్షా ఫలితాల్లోనూ సత్తా చాటారు. తెలుగు స్కూల్ అసిస్టెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించారు. తెలుగు పండిట్ గ్రేడ్-2లో సైతం జిల్లా స్థాయిలో మెుదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. తన భర్త ప్రోత్సాహంతోనే ఈ ఫలితాలు సాధించానని ఆమె వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa