ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంతను బ్రాండ్ అంబాసిడర్ చేయటం వెనుక ఆ సంబంధాలేంటో.. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 05:58 PM

ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దూమారం రేపుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీద విమర్శలు చేసే నేపథ్యంలో.. అక్కినేని కుటుంబం, సమంతపై అనుచిత ఆరోపణలు చేయటం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వివాదం నడుస్తున్న క్రమంలోనే.. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా సమంతపై చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నెల క్రితం ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. హైడ్రా కూల్చివేతలపై మాట్లాడిన రఘునందన్ రావు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారుతో పాటు సమంతపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేయగా.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి.


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్లతో కాళేశ్వరం అన్నారని.. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన అంటున్నారని.. తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు ఎంపీ రఘునందన్ రావు. అయితే.. చెరువు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలే లక్ష్యంగా కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతల్లో.. పెద్ద తలకాయల నిర్మాణాలను కూడా నేలమట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్- కన్వె్న్షన్ కూల్చేసినప్పుడు తానే మొదటగా స్పందించినట్టు చెప్పుకొచ్చారు. కోర్టు స్టేటస్ కో ఇచ్చినా కూడా ఎందుకిస్తుందని ప్రశ్నించినట్టు చెప్పుకొచ్చారు.


2014లోనే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు.. ఎన్- కన్వెషన్ మీద సర్వే చేయాలని ఆదేశించిందని రఘునందన్ గుర్తుచేశారు. హెచ్ఎండీఏ సర్వే చేసి 2016లో కోర్టుకు రిపోర్టు ఇచ్చిందని.. మూడున్నర ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని అందులో తేల్చారని పేర్కొన్నారు. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు కూల్చలేదని.. కోర్టు ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించారు.


మరి ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందని జర్నలిస్ట్ ప్రశ్నించగా.. రఘునందన్ రావు కొంచెం ఘాటుగా సమాధానం ఇచ్చారు. అదే సమయంలో నాగార్జున కోడలు సమంత.. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌ అయ్యిందని గుర్తు చేశారు. చీర తెలవని.. చేనేత తెల్వని సమంతను తీసుకొచ్చి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌ను చేశారన్నారు. ఆ సంబంధాలేంటో వాళ్లే చెప్పాలన్నారు. వాళ్లకు ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధమేంటో వాళ్లే చెప్తే బాగుంటుందని.. తన నోటిని ఎందుకు కరాబ్ చేసుకుంటాననంటూ ఘాటు ఆరోపణలు చేశారు రఘునందన్ రావు.


రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం అంటే.. కేవలం నాగార్జునకు సంబంధించిన ఎన్-కన్వెన్షన్‌ మీదే ఉంటుందా.. ఇంకా ఏమైనా ఉన్నాయా అని జర్నలిస్ట్ ప్రశ్నించగా.. పద్మాలయ స్టూడియోలో అపార్ట్‌మెంట్‌ కట్టేందుకు పర్మిషన్ ఎవరిచ్చారని.. ల్యాంకో హిల్స్ కట్టిన భూమి వక్ఫ్ భూములన్నారని.. ఇలా చాలానే ఉన్నాయంటూ రఘునందన్ పెద్ద చిట్టానే చెప్పుకొచ్చారు. అయితే.. ప్రస్తుతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే దుమారం రేపుతుంటే.. ఇప్పుడు రఘునందన్ కూడా సమంత విషయంలో మరోసారి ఘాటు కామెంట్లు చేయటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.


ఇప్పటికే.. కొండా సురేఖ మీద జరిగిన ట్రోలింగ్స్ వ్యవహారంలో ఒక తమ్ముడిగా అక్కకు అండగా ఉంటానని.. ఒక వకీలుగా ట్రోలింగ్ చేసిన వ్యక్తులపై కేసులు పెడతానంటూ రఘునందన్ రావు మద్దతుగా నిలిచారు. అయితే.. అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్ చేయకపోగా.. ముందు నుంచే.. ఈ విషయాన్ని రఘునందన్ రావు ప్రస్తావిస్తుండటం గమనార్హం. అయితే.. ఇప్పుడు ఈ విషయం దుమారం రేపుతుండగా.. మరోసారి ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa