ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు.. చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 06:05 PM

సింగరేణి కార్మికులకు ఐదు రోజుల ముందుగానే దసరా పండగ వచ్చేసింది. కార్మికులకు ప్రభుత్వం బోనస్ చెక్కులు పంపిణీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కార్మికులు బోనస్ చెక్కులు అందుకున్నారు. ఈ ఏడాది సింగరేణికి రూ.2412 కోట్ల లాభం రాగా.. అందులో 33 శాతం అంటే రూ.796 కోట్లను కార్మికులకు ప్రభుత్వం బోనస్‌గా ప్రకటించిన సంగతి తెలిసందే. దాదాపు 42 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1.90 లక్షల చొప్పున బోనస్‌గా అందుకుంటున్నారు. సింగరేణిలో పనే చేసే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈ ఏడాది రూ. 5 వేల బోనస్ ప్రకటించారు.


చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి.. సంస్థలో ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ఎంప్లాయీస్‌ మధ్య ఖర్చు విషయంలో వ్యత్యాసం చాలా ఉందని అన్నారు. ఈ వ్యాత్యాసాన్ని తగ్గించుకోవానికి సంస్థ ప్రయత్నించాలని సూచించారు. ఒక టన్ను బొగ్గు ఉత్పత్తి చేయడానికి రెగ్యులర్ ఎంప్లాయిస్‌పై రూ.3 వేల నుంచి రూ.9 వేల వరకు ఖర్చు చేస్తుంటే.. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌పై మాత్రం రూ.1500- రూ.4,500 వరకు మాత్రమే ఖర్చవుతోందని అన్నారు. కార్మికుల వేతనాల్లో భారీ వ్యాత్యాసం ఉండడం శ్రమ దోపిడీ కిందకే వస్తుందని చెప్పారు.


తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రమదోపిడీని సహించదని అన్నారు. అందుకే ఈ వ్యత్యాసాన్ని తగ్గించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అన్నారు. సింగరేణిలో మినిమం వేజెస్ పెంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అవసరమైతే ప్రత్యేకంగా ఓ కమిటీ వేసి కాంట్రాక్ట్, రెగ్యులర్ ఎంప్లాయీస్ మధ్య ఉండే వేతనాల వ్యత్యాసాన్ని తగ్గించడానికి తమవంతుగా ప్రయత్నిస్తామని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. సింగరేణి గనుల్లో పని చేసే కార్మికులు వైద్యం కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా చూస్తామన్నారు. సమీపంలోనే మెరుగైన వైద్యం అందించేందుకు అధునాతన హాస్పిటల్స్‌ నిర్మించనున్నట్లు చెప్పారు.


సింగరేణి భూమిని కేటాయిస్తే.. అక్కడ యంగ్ ఇండియా ఇంగిగ్రేటెడ్ స్కూల్స్‌ని పైలెట్ ప్రాజెక్ట్‌గా కింద నిర్మిస్తామని అన్నారు. పెన్షన్ విషయంలోనూ అధ్యయనం చేస్తామని.. ప్రస్తుతం రూ.8 లక్షలుగా ఉన్న పెన్షన్‌ను రూ.10 లక్షల వరకు పెంచేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa