ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విద్యార్థినికి లోకల్ కోటాలోనే సీటు ఇవ్వండి.. కాళోజీ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 09:16 PM

ఓ విద్యార్థినికి ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ విషయంలో వచ్చిన ధర్మ సంకటంపై కాళోజీ విశ్వవిద్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సదరు విద్యార్థినికి లోకల్ కోటాలోనే సీటు ఇవ్వాలని యూనివర్సిటీని ఆదేశించింది. దుబాయ్‌లో పాఠశాల విద్యను అభ్యసించి.. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన.. హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన అనుమత ఫరూక్‌ను.. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా పరిగణించకుండా తప్పించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ మీద విచారణ చేపట్టిన.. చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాధే, జస్టిస్‌ శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం.. ఈ తీర్పును వెలువరించింది.


అయితే.. ఫరూక్ 1998 నుంచి 2008 వరకు (10వ తరగతి వరకు) దుబాయ్‌లో విద్యాభ్యాసం చేసింది. 2019 నుంచి తెలంగాణలోనే నివాసం ఉంటోంది. తెలంగాణలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి నీట్ పరీక్షకు హాజరయ్యారైనట్టు.. పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. జులైలో తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టానికి ఇటీవల చేసిన సవరణల ప్రకారం.. ఒక విద్యార్థి తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు చదివినా.. లేదా అదే వ్యవధిలో రాష్ట్రంలో నివసించినా.. వారిని స్థానిక అభ్యర్థిగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయవాది వివరించారు.


నివాస అవసరాన్ని పూర్తి చేసి.. అవసరమైన ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించినప్పటికీ.. పిటిషనర్‌ను స్థానిక అభ్యర్థిగా పరిగణించకపోవటం దారుణమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విద్యార్థినిని ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా గుర్తించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌‌ను ఆదేశించింది. లోకల్ కేటగిరీ కింద అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆ విద్యార్థినికి అనుమతి ఇవ్వాలని యూనివర్సిటీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.


తెలంగాణ స్థానికతపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై సర్వత్రా వివాదం తలెత్తడంతో ఈ ఏడాది ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది. కోర్టు వివాదాలతో.. కౌన్సిలింగ్‌ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఇంటర్మీడియట్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితే మాత్రమే స్థానికులుగా గుర్తించేలా జారీ చేసిన జీవో 33పై కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. స్థానికతకు సంబంధించిన మార్గదర్శకాలను కొత్తగా రూపొందించాలని హైకోర్టు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa