ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ ప్రత్యేక భేటీ.. ఆ రెండు అంశాలపైనే ప్రధాన చర్చ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 09:19 PM

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమవేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా హజరయ్యారు. అయితే.. సమావేశం అనంతరం.. అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కావటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా రెండు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.


ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దేశంలో తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశం అనంతరం.. అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో.. విభజన చట్టంలోని పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు రెండు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి వరద సాయం నిధుల అంశం కాగా.. మూసీ ప్రక్షాళనకు నిధులు అంశం మరొకటి. అయితే.. తెలంగాణకు ఇప్పటికే.. వరద సాయం నిధులు విడుదల చేయగా.. అవి సరిపోవని.. వరద సాయం పెంచాలని అమిషాను రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.


ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌కు 1036 కోట్ల నిధులు విడుదల చేయగా.. తెలంగాణకు మాత్రం కేవలం 416 కోట్ల 80 లక్షలు మాత్రమే విడుదల చేసింది. అయితే.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా.. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిశాయని.. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించి వరదలు పోటెత్తాయని.. చాలా నష్టం వాటిల్లిందని అమిత్ షాకు రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం.


ఇదిలా ఉంటే.. మరోవైపు హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన చెపట్టనున్నట్టు అమిత్ షాకు రేవంత్ రెడ్డి తెలిపినట్టు సమాచారం. నమామి గంగే తరహాలో మూసీని ప్రక్షాళన చేసి సుందరీకరించనున్నట్టు వివరించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం తరపున ఆర్థిక సాయం అందించాలని కోరినట్టు సమాచారం.


అయితే.. అంతకు ముందు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు పాల్గొన్నారు. 2026 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేయాలనే లక్ష్యంతో.. కేంద్రం పని చేస్తున్నట్టు హోంశాఖ వివరించింది. మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో హోంశాఖ చర్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. దేశంలో నక్సలిజం చివరి దశకు చేరుకుందని అమిత్ షా తెలిపారు. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్టు వివరించారు.


అయితే.. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్ఠానాన్ని వరుసగా కలుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మరి ఈసారైనా.. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఏదైనా వార్తతో వస్తారా లేదా అన్నది ఇప్పుడు శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa