తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. మెుత్తం మూడు విడతల్లో అన్నదాతల రుణాలు మాఫీ చేశారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్ల రుణాలు మాఫీ చేయగా.. సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతులకు మాఫీ వర్తించలేదని వారికి కూడా త్వరలోనే మాఫీ వర్తింప చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతోందని.. సర్వే అనంతరం మాఫీ చేయనున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తాజాగా.. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు మరో తీపి కబురు చెప్పారు.
రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా పథకం అమలు చేస్తామని అన్నారు. మరో వారం, పది రోజుల్లో రైతు రుణమాఫీ అయిపోతుందని.. ఆ తర్వాత రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు చేప్పారు. తెలంగాణలో రుణమాఫీ హామీ అమలు కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు. ఇప్పటికే 18 వేల కోట్ల మాఫీ పూర్తి చేశామని.. సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతులకు మాఫీ వర్తించలేదని వారికి కూడా మాఫీ వర్తింపజేస్తామన్నారు.
ఇక రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ప్రతి ఎకరాకు రూ. 15 వేల పంట సాగు సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్లలో రెండు విడతల్లో రూ.7 వేల చొప్పున సాయం అందించనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు రూ. 10 వేలు పంట పెట్టుబడి సాయం అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అదే పథకాన్ని రైతు భరోసాగా మార్చి ఎకరాకు రూ. 15 వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఈ పథకాన్ని అర్హులైన రైతులకే అందజేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు.
గతంలో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ స్థలాలు, సాగులో లేని భూములకు సైతం రైతుబంధు సాయం అందించి నిధులు పక్కదారి పట్టించారని తుమ్మల ఆరోపంచారు. ఈసారి మాత్రం అలా కుదరదని అన్నారు. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు బంధు సాయం అందిస్తామన్నారు. అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్ని ఎకరాల లోపు రైతుబంధు సాయం అందిచాలనే దానిపైనా కసరత్తు జరుగుతోందని అన్నారు. త్వరలోనే విధివిధానాలు ఖరారు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa