ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 09:32 PM

హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్. అక్కడికి వెళ్లే ట్రైన్ టైమింగ్స్ త్వరలోనే మారనున్నాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ట్రైన్ టైమింగ్స్ మార్చేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చర్యలుచేపట్టారు. ఇటీవల హైదరాబాద్ (సికింద్రాబాద్ రైల్వే స్టేషన్)- గోవా (వాస్కోడిగామ) ట్రైన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ఊ ట్రైన్ ప్రారంభించారు. ప్రతి ఏడాది 80 లక్షల మంది గోవా టూర్‌కు వెళితే.. అందులో 20 శాతం వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఉంటున్నారు.


ఈ నేపథ్యంలో అక్టోబరు గత 15 రోజుల క్రితం గోవాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసును ప్రారంభించింది. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఈ ట్రైన్ గోవాకు, గురు, శని వారాల్లో సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తోంది. ఈ ప్రత్యేక రైలు సర్వీసు ప్రారంభించిన వారం రోజుల్లోనే ట్రైన్ ఆక్యుపెన్సీ 70 శాతం చేరుకుంది. అయితే ప్రస్తుతం ఉన్న ట్రైన్ టైమింగ్స్ పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రైన్ వేళలతో తమకు ప్రయాస పెరుగుతోందని అంటున్నారు.


సెలవు రోజుల్లో గోవా టూర్‌కు ప్లాన్ చేసుకుంటే.. రెండు రోజులు రాకపోకలకే సరిపోతోందని అంటున్నారు. ట్రైన్ల రాకపోకల టైమింగ్స్ మారిస్తే గోవా వెళ్లేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు గోవా ట్రైన్ ఎక్కితే మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు గోవా (వాస్కోడిగామ) చేరుతుందని అంటున్నారు. ఈ టైమింగ్స్‌తో ఇబ్బందిగా ఉంటుందని.. హోటల్‌ బుకింగ్, ఇతర ప్రయాణాలకు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కేవలం గోవా వెళ్లి వచ్చేందుకు ట్రైన్ జర్నీకే 38 గంటల సమయం పడుతోందని అంటున్నారు. అంటే దాదాపు రోజున్న ట్రైన్‌లోనే గడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైన్లలో ఉదయాన్నే 5.45 గంటలకు వాస్కోడిగామ రైల్వ స్టేషన్‌లో దిగితే.. హోటల్‌ బుకింగ్‌ కోసం మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాల్సి వస్తుందన్నారు. హోటళ్లలో మధ్యాహ్నం 2 వరకు కొత్త బుకింగ్‌లు తీసుకోవటం లేదని వాపోతున్నారు. అందుకే ట్రైన్ టైమింగ్స్ సాయంత్రం 5 గంటలకు మార్చితే మరుసటిరోజు ఉదయం 11కల్లా గోవా చేరుకోవచ్చనుని అంటున్నారు. ట్రైన్ల వేళలు మార్చటంతో పాటుగా సాధారణ ట్రైన్ కాకుండా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్లపై సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ స్పందించారు. ట్రైన్ టైమింగ్స్ మార్పుపై చర్చిస్తున్నామన్నారు. ఇప్పటికే సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే అధికారులకు లేఖలు రాసినట్లు చెప్పారు. అక్కడి ట్రైన్ల వేళలు, ట్రాఫిక్‌కు అనుగుణంగా సర్దుబాటు జరిగితే ట్రైన్ టైమింగ్స్ మార్చనున్నట్లు ఆయన వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa