తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిదికి సంబంధించిన ఇంట్లో జరిగిన పార్టీ వ్యవహారంపై పోలీసుల దాడి చేయటం, ఆ తర్వాత కేసులు నమోదు చేయటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో 2 రోజులుగా జరుగుతున్న పరిణమాలు కేవలం ఆరంభమేనని.. రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు కేటీఆర్.
"త్వరలో మనపై కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారం చేయడం చూస్తాం. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పెయిడ్ సోషల్ మీడియా ట్రోల్స్ మనల్ని టార్గెట్ చేస్తాయి. ఏం జరిగినా ఆశ్చర్యపోవద్దు. వాటిని మీ దృష్టి మరల్చనివ్వద్దు." అంటూ ట్విట్టర్ వేదికగా కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు కేటీఆర్.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో రెండు రోజులు బీఆర్ఎస్ సంబురాలు జరపాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి (ERC) తిరస్కరించినందుకు గానూ రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల భారం పడకుండా ఆపినందుకు విజయ సూచికగా ఈ సంబురాలు నిర్వహించాలని కోరారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో సంబరాలు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
10 నెలల్లోనే రూ.18500 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం చేయగా.. ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్లో పాల్గొని ఈఆర్సీని ఒప్పించగలిగినట్టు కేటీఆర్ తెలిపారు. మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్ర నుంచి ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షం వాదనలోని సహేతుకతను, న్యాయాన్ని విని ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించడం ఇదే మొదటిసారి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను బీఆర్ఎస్ వినిపించిన ఈ సందర్భం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సరైన పద్ధతిలో శాస్త్రీయంగా ఈఆర్సీ ముందు ఉంచడంలో విజయం సాధించామని కేటీఆర్ తెలిపారు
రాష్ట్ర ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా తాము వినిపించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఈఆర్సీ.. విద్యుత్ భారం మోపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించిన తీరు గొప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఈఆర్సీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల తరఫున సంబరాలు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa