తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా హనుమంతరావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా నారాయణ రెడ్డి, నల్గొండ కలెక్టర్గా త్రిపాఠిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్గా మందా మకరందు, పర్యాటక శాఖ సంచాలకులుగా జెడ్ కె.హనుమంతులును నియమించగా.. దేవాదాయ శాఖ సంచాలకులుగా హనుమంతులుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
అయితే.. మరో డేరింగ్ లేడీ ఆఫీసర్ అయిన టీకే శ్రీదేవికి పురపాలక శాఖ సంచాలకులుగా కీలక బాధ్యతలు అప్పజెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. గతంలో బీఆర్ఎస్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన టీకే శ్రీదేవి.. 2023లో కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయటంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ.. చర్చనీయాంశంగా మారారు. కాగా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్.. కీలక శాఖ అయిన పురపాలన శాఖ బాధ్యతలు అప్పగించటం గమనార్హం.
మరోవైపు.. విపత్తు నిర్వహణ శాఖ సంయుక్త కార్యదర్శి హరీశ్కు ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఇక.. డెయిరీ కార్పొరేషన్ ఎండీగా కె.చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఎస్.దిలీప్ కుమార్, ఆర్ అండ్ ఆర్, భూసేకరణ కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్గా నిఖిల్ చక్రవర్తికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఏకంగా.. 47 మంది డిప్యూటీ, 23 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను రేవంత్ రెడ్డి సర్కార్ బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల అదనపు కలెక్టర్లు, 4 జిల్లాల డీఆర్వోలు స్థానచలనం అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా.. ఆ శాఖలో 70 మంది అధికారులను ఒకేసారి బదిలీ చేయటం సర్వత్రా చర్చనీయాశంగా మారింది. రెవెన్యూ సంఘాల పదోన్నతులు, బదిలీల గురించి అధికారులు ఇప్పటికే మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖలో ఒకేసారి భారీగా బదిలీలు చేపట్టినట్టు తెలుస్తోంది. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, భూసేకరణ అధికారులు, సివిల్ సప్లయిస్ శాఖల్లో అధికారులు అయ్యారు. ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 28న) రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa