ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పత్తి చేనులో.. కలుపు తీద్దామని వెళ్లేసరికి, పంట మధ్యలో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 04, 2024, 07:26 PM

సమాజం వేగంగా అభివృద్ధి చెందుతోంది. బుల్లెట్ ట్రైన్‌లలో మనుషులు క్షణాల్లో గమ్యాలు చేరుతున్నారు. చంద్రయాన్ పేరుతో జాబిల్లిపైన ప్రయోగాలు చేస్తున్నారు. సూర్యునిపై కూడా ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. చేతిలోనే ప్రపంచాన్ని చూసేస్తున్నారు. ఒక్క అడుగు కూడా వేయకుండా.. కూర్చున్న చోటికే కావాల్సింది తెప్పించుకుంటున్నారు. సమాజంలో ఇంత జరుగుతున్నా.. కొందరు మాత్రం ఇప్పటికీ రోడ్డుపై నిమ్మకాయ, పసుపు, కుంకుమ కలిసి కనిపిస్తే చాలు దాన్ని దాటి వెళ్లేందుకు గజగజా వణికిపోతున్నారు.


ఈరోజుల్లో కూడా ఇంకా చేతబడి, బాణామతి అంటూ రకరకాల పేర్లతో ఎక్కడపడితే అక్కడ.. పసుపు, కుంకుమలతో ముగ్గురు వేయటాలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు, బొమ్మలు పెట్టటాలు లాంటివి కనిపిస్తుంటాయి. ఇంకొంత మంది నల్లకోడిని కూడా చంపేసి పడేస్తుంటారు. అచ్చంగా అలాంటిదే దర్శనమిచ్చింది నాగార్ కర్నూల్ జిల్లాలో కూడా. అయితే.. ఈసారి రోడ్డు మీదనో, ఇంట్లోనో, స్కూలులోనో కాకుండా.. ఓ పత్తి చేనులో దర్శనమిచ్చింది.


తెలకపల్లి మండలం తాళ్లపల్లికి చెందిన చాకలి తిరుపతయ్య అనే రైతుకు చెందిన పత్తి పంటలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్టుగా స్థానికులు భయపడుతున్నారు. పత్తి పంట మధ్యలో.. కుంకుమ, పసుపు, సున్నంతో పాటు మరికొన్ని రంగులతో పెద్ద పటం వేశారు. వివిధ రకాల వస్త్రాలతో బొమ్మలు తయారు చేసి ఆ పటం మధ్యలో పెట్టారు. అంతేకాకుండా పిండితో ఓ బొమ్మను తయారు చేసి పటం మధ్యలో ఉంచి ఇనుప మేకులు గుచ్చారు. చుట్టుప్రక్కల బయట ప్రాంతంలో నాలుగు చీలలను భూమిలో పాతిపెట్టి.. పిండితో చేసిన బొమ్మకు వివిధ రకాల బట్ట పీలికలను కట్టి ఉంచారు. టెంకాయలను కొట్టి నిమ్మకాయలు కోసి మధ్యలో ఉంచారు. ఎండు కొబ్బరి గిన్నెలను పటం నలువైపులా ఉంచి వత్తులు వేసి దీపాలు వెలిగించారు.


అయితే.. తిరుపతయ్య రెండు రోజుల అనంతరం కలుపు తీద్దామని చేనుకు వెళ్లి చూడగా.. ఈ దృశ్యం కనిపించటంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే చుట్టుపక్కల ఉన్న రైతులను పిలిచి చూపించారు. ఈ దృశ్యాన్ని చూసిన అందరూ భయాందోళనకు గురయ్యారు. ఎవరో తిరుపయ్యకు పడని వాళ్లే.. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి పని చేశారని.. స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన మొత్తాన్ని గ్రామ పెద్ద మనుషులకు, స్థానిక రైతులకు చెప్పారు. బాధిత రైతు తిరుపతయ్య ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు. తనకు తన దాయాదులపైనే అనుమానం ఉందని.. చాలా రోజులుగా భూ వివాదాలు ఉన్నాయని.. అందుకే తనను భయపెట్టేందుకే ఇలాంటి పనులకు పాల్పడినట్టుగా తిరుపతయ్య పోలీసులకు మొరపెట్టుకున్నాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa