స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఈనెల 6 నుంచి కుల గణన చేపట్టనున్నారు. ఇక స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన పలు అంశాలపై సీఎం తన నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం సాయంత్రం సమావేశమై చర్చించారు.
రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన రేపటిలోగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి కీలకమైన అంశాల్లో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు ఉండవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.
ఇక బీసీ కమిషన్ నిర్వహిస్తున్న బహిరంగ విచారణ కార్యక్రమాలు ప్రస్తుతం వాయిదా పడ్డాయి. బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వే కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విచారణ వాయిదా పడింది. ఇప్పటికే బీసీ కమిషన్కు కుల సర్వే చేసేందుకు ప్రత్యేక కమిషన్గా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇక నుంచి బీసీ కులగణన సర్వే బాధ్యత సైతం కమిషన్ తీసుకోనుంది. కాగా.. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్లో బహిరంగ విచారణను పూర్తి చేసింది. మిగిలిన జిల్లాల్లో బహిరంగ విచారణ జరగాల్సి ఉండగా.. అవి వాయిదా పడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa