ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, టీచర్లకు శాపాలుగా మారుతున్నాయని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇంటింటి కుటుంబ సర్వేలకు టీచర్లను ఉపయోగించవద్దని సూచించారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఇంటింటి కుటుంబ సర్వే విధుల నుంచి ఎస్జీటీలను మినహాయించాలన్నారు.సర్వేలకు ఎస్జీటీలను ఉపయోగించడం అంటే విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అన్నారు. సర్వేకు ఎస్జీటీలు, హెడ్ మాస్టర్లను భాగం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. సర్వేలకు టీచర్లను వినియోగించి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.36,559 ఎస్జీటీలను, 3,414 మంది ప్రధానోపాధ్యాయులను ఈ సర్వేలో భాగం చేస్తూ నవంబర్ 1న విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకే పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల సారాంశంగా కనిపిస్తోందన్నారు.విద్యాహక్కు చట్టం ప్రకారం, ఉపాధ్యాయులను జనాభా గణన లెక్కలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ విధులు, పార్లమెంటు, రాష్ట్ర శాసన సభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన విధులకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేస్తోందన్నారు.ఇవి కాకుండా మరే ఇతర పనులకు వినియోగించకూడదని విద్యా హక్కు చట్టం చెబుతోందన్నారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కోసం ఉపాధ్యాయులను వినియోగించుకోవడం విద్యా హక్కు చట్ట ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa