ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. కానిస్టేబుల్ చెల్లి పెళ్లికి పెద్దన్నగా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 10:30 PM

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. "అధైర్యపడకండి.. నేను మీకు అండగా ఉంటా.." అని కానిస్టేబుల్ కుటుంబానికి ఇచ్చిన మాటను నిల‌బెట్టుకున్నారు. ఏక్ పోలీసు విధానం అమలు చేయాలంటూ ఆందోళన చేసిన కానిస్టేబుళ్లలో కొందరిని డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. అందులో ఒకరైన మానకొండూర్ నియోజకవర్గం గంగిపల్లికి చెందిన బెటాలియన్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌. తనను సర్వీస్ నుంచి తొలగించటంతో.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


అయితే.. రెండు రోజుల క్రితం సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ను శ్రీనివాస్ కలిశారు. ఈ నెల (నవంబర్) 14వ తేదీన తన చెల్లెలి పెళ్లి ఉందని.. కానీ ఇంతలో తనను ఉద్యోగం నుంచి తీసేశారని, చెల్లి పెళ్లి ఎలా జరుగుతుందని తన తల్లి తీవ్ర బెంగపెట్టుకుందని కేటీఆర్‌తో తన బాధ చెప్పుకుని శ్రీనివాస్ గోడువెళ్లబోసుకున్నారు. శ్రీనివాస్‌కు ధైర్యం చెప్పిన కేటీఆర్.. ఆయన తల్లితో ఫోన్‌లో మాట్లాడారు. తన కూతురి వివాహానికి ఒక పెద్దన్నగా ఆర్థిక సహాయం చేస్తానని ఆ తల్లికి కేటీఆర్ మాట ఇచ్చారు. అంతేకాకుండా.. శ్రీనివాస్‌ను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకునేలా కొట్లాడతానని భరోసానిచ్చారు.


శ్రీనివాస్ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వివాహం కోసం రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందించారు. ప్రస్తుతం కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండగా.. కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు ఈరోజు (నవంబర్ 12న) శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయాన్ని అందించారు.


ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి మీద కేంద్రం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అమృత్ స్కీంలో రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్లపై కేటీఆర్ స్పందించారు.


ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎమ్మెల్యేలను గొర్రెలు కొన్నట్లు కొంటున్నారని మల్లిఖార్జున ఖర్గే కామెంట్ చేయగా.. ఒకసారి తెలంగాణ వచ్చి చూస్తే ఇక్కడ గొర్రెల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూసి ఆశ్చర్యపోతారంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. అతి పెద్ద గొర్రెల కొనుగోలుదారుడిని అందించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అంటూ సెటైర్లు వేశారు.


బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకున్నారని ఖర్గేకు కేటీఆర్‌ గుర్తు చేశారు. వాళ్లలో కొందర్ని కొనుగోలు చేశారని.. మరికొందరిని బెదిరించారంటూ కీలక ఆరోపణలు చేశారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో వారికి కూడా తెలియని దయనీయ పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు. వారిని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నిలబెట్టి దీనిపై అడగాలని ఖర్గేను కేటీఆర్ డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa