ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్‌ ట్రైన్ కారిడార్‌.. ఈ ప్రాంతాల మీదుగా, వేగంగా చేరుకోవచ్చు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 17, 2024, 09:12 PM

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతినిత్యం వేల సంఖ్యలో ప్రజలు ట్రైన్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే అనేక ట్రైన్లు సేవలు అందిస్తున్నాయి. వేగంగా గమ్యస్థానానికి చేరుకునేందుకు వందే భారత్ మెట్రో ట్రైన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించేవారు మరింత వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా శంషాబాద్‌-విశాఖపట్నం సెమీ హైస్పీడ్‌ ట్రైన్ కారిడార్‌ను ప్రతిపాదించారు. ఈ ట్రైన్లు గంటకు 220 కి.మీ.ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా రూ.21 వేల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.


అయితే ఈ ప్రాజెక్టులో రైల్వే స్టేషన్ల సంఖ్య పరిమితంగా ఉండనున్నట్లు సమాచారం. ఓసారి ఎలైన్‌మెంట్‌ను పరిశీలిస్తే సగటున ప్రతి 49 కి.మీ.లకు ఒక ట్రైన్ స్టేషన్‌ను ప్రతిపాదించారు. ఇక్కడ రెండు స్టేషన్ల మధ్య అతి తక్కువ దూరం 27.76 కిమీ. ఇది సూర్యాపేట-నకిరేకల్‌ మధ్య ఏర్పాటు చేయనున్నారు. గరిష్ఠ దూరం చూస్తే ఏపీలోని తుని-రాజమహేంద్రవరం మధ్య 88 కి.మీ.లు ఉండనుంది. అతి తక్కువ సమయంలో హైదరాబాద్ నుంచి కేవలం 4 గంటల్లో విశాఖకు ప్రయాణికులను చేర్చాలనే లక్ష్యంతో స్టేషన్ల సంఖ్యను పరిమితం చేసినట్లు తెలసింది.


ఈ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో మొత్తంగా 12 స్టేషన్లు ప్రతిపాదించారు. అందులో తెలంగాణలో ఆరు, ఏపీలో ఆరు స్టేషన్లు ఉన్నాయి. కర్నూలు-విశాఖపట్నం మార్గాన్ని కర్నూలు నుంచి శంషాబాద్‌-విశాఖ మార్గంలో వచ్చే సూర్యాపేట వరకు నిర్మించాలన్నది రైల్వేశాఖ ప్రణాళిక. ఈ రూట్‌లో వచ్చే 8 అదనపు స్టేషన్లలో కర్నూలు మినహా మిగిలిన అన్నీ తెలంగాణలోనే రానున్నాయి. నవంబరులో రైల్వే బోర్డుకు ప్రిలిమినరీ ఇంజినీరింగ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే నివేదిక సమర్పించనుండగా.. ప్రాజెక్టు వ్యయంపై అప్పటికి స్పష్టత రానుంది.


ఇక ఈ ప్రాజెక్టును విజయవాడ నేషనల్ హైవే ఎల్‌బీనగర్‌ - చౌటుప్పల్‌ మార్గంలో కాకుండా శంషాబాద్‌ నుంచి మునుగోడు నియోజకవర్గం గుండా ప్రతిపాదించారు. జాతీయరహదారిలోని చౌటుప్పల్‌ నుంచి 24 కిమీ లోపల ఉండే గట్టుప్పల్‌ నుంచి ప్రాజెక్టు అలైన్‌మెంట్ ఖరారు చేశారు. చిట్యాల వెస్ట్, నకిరేకల్, సూర్యాపేట జంక్షన్‌ ప్రతిపాదిత స్టేషన్లూ ఎలైన్‌మెంట్‌లో నేషనల్ హైవేకు కొంత దూరంలో ఉండనున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa