దక్షిణ కాశీగా పేరుగాంచిన.. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ. అయితే.. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా.. వేములవాడ పుణ్యక్షేత్ర ప్రాశస్త్యం ఎంతో గొప్పగా ఉన్నా.. భక్తులు భారీ సంఖ్యలో రాజన్నను దర్శించుకుంటున్నా.. ఏళ్ల తరపడి ఆలయ అభివృద్ధికి మాత్రం నోచుకోవట్లేదు. అయితే.. గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. కార్యరూపం దాల్చలేదు. అయితే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగానే.. నూతనంగా రెండో ధర్మగుండం నిర్మాణం, క్యూలైన్ల విస్తరణ, వసతి గదులు, కల్యాణ మండప నిర్మాణం, కోడెలకు ఆధునిక వసతులతో గోశాల, యాగశాల, అన్నదాన సత్రం వంటి అభివృద్ధి పనులు చేపట్టగా.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఆలయ అభివృద్ధికి సర్కార్ పూనుకుంది. ఈ క్రమంలోనే.. ఆలయ అభివృద్ధి కోసం.. ప్రభుత్వం ఏకంగా రూ.126.56 కోట్లను విడుదల చేసింది. ఈమేరకు సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
కాగా.. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. బుధవారం (నవంబర్ 20న) రోజున సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా.. వేములవాడ ఆలయంతో పాటు పట్టణాభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగానే.. ఈరోజు (నవంబర్ 18న) వేములవాడ క్షేత్ర అభివృద్ధి కోసం రూ.127.65 కోట్లు మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా.. ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమంలో.. ముఖ్యంగా రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణతో పాటు భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం రూ.76 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరోవైపు.. ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న ఇరుకు రోడ్లను విస్తరించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రూ.47.85 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. మరోవైపు.. మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణం కోసం రూ.3.8 కోట్లు విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు నవంబర్ 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా శంకుస్థాపనలు చేయనున్నారు.
వీటితో పాటుగా.. కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వేములవాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం (నవంబర్ 20) ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తుల దర్శనాలు పూర్తిగా నిలిపేశారు. సీఎం రేవంత్ రెడ్డి దర్శనం తర్వాత.. తిరిగి భక్తులకు అవకాశం కల్పించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa