ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో కొత్తగా 4 విమానాశ్రయాలు.. అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కూడా.. మంత్రి కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2024, 07:38 PM

తెలంగాణలో ప్రస్తుతం.. హైదరాబాద్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుతో పాటు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమనాశ్రయాలు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ వరంగల్ జిల్లాలోని మామునూరులోని విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించటమే కాకుండా.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. ఎయిర్ పోర్ట్ విస్తరణకు 256 ఎకరాలు అవసరముండగా.. అందుకోసం పరిపాలనా అనుమతులు ఇస్తూ.. 205 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. అంతేకాదు.. నవంబర్ 19వ తేదీన ఎయిర్ పోర్టు పనులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు గ్రీన్ ఫీల్ట్ ఎయిర్ పోర్టులు కూడా రానున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.


సోమవారం (నవంబర్ 18న) రోజున సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టుకు ఎన్‌ఓసీ సాధించామని.. దీంతో వరంగల్ ప్రజల కల నెరవేరబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ విమానాశ్రయాన్ని 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామన్నారు. 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందన్నారు. పాత ఒప్పందం రద్దుకు జీఎంఆర్ సంస్థను ఎంతో కష్టపడి ఒప్పించామని మంత్రి తెలిపారు.


డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. ప్రతిపాదనలో ఉన్న మిగతా నాలుగు విమానాశ్రయాలను కూడా ఈ నాలుగేళ్లలో తప్పకుండా సాధిస్తామని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు సాధిస్తామని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ హైవే ఆరు లైన్ల రోడ్డు పనులను జనవరిలో ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. శ్రీశైలం క్షేత్రానికి రూ.7 వేల కోట్ల ప్రాజెక్టును సాధించనున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శ్రీశైలానికి రిజర్వ్ ఫారెస్ట్ గుండా 62 కిలోమీటర్ల మేర సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు సాకారమవుతోందని చెప్పుకొచ్చారు.


నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్‌ సమీపంలోని దేవరకొండలో గ్రీన్‌ఫీల్డ్‌ (కొత్తగా ఏర్పాటుచేయడం) ఎయిర్‌పోర్టులు, వరంగల్‌ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌తో పాటు ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్‌ (ప్రస్తుతం ఉన్నవాటిని అభివృద్ధి చేయడం) ఎయిర్‌పోర్టులు అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే.. ఇందులో మామునూరు, జక్రన్ పల్లి‌, ఆదిలాబాద్‌లో మాత్రమే టెక్నికల్‌గా ఫీజిబిలిటీ ఉన్నట్టు ఏఏఐ గతంలోనే తెలపగా.. మిగతా విమానాశ్రయాల గురించి ప్రస్తవించలేదు. కాగా.. వాటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌ పోర్టును సాధిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.


2018లో ప్రారంభం అయిన ఉప్పల్ స్కైవే పనులు ఇప్పటికి 30 శాతం మాత్రమే పూర్తయ్యాయని.. రాబోయే ఏడాదిన్నరలోపు నిర్మాణం పూర్తి చేస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రీజినల్ రింగ్ రోడ్డును 2016లో నాటి ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ అప్పటి నుంచి పనులను పెండింగ్‌లోనే పెట్టిందని మండిపడ్డారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణకు ఇచ్చే నిధులపై స్పష్టత కోరితే కేంద్రం ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని దుయ్యబట్టారు. రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పనులు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఓఆర్ఆర్ (ORR) వల్లే ఆర్ఆర్ఆర్ కూడా హైదరాబాద్‌కు, తెలంగాణకు గేమ్ చేంజర్ కాబోతుందని కోమటిరెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa