హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల మళ్లీ మెుదలయ్యాయి. అక్రమ కట్టడాలపై హైడ్రా బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. వారం క్రితం నాగారంలోని పలు అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు తాజాగా.. హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కూల్చివేతలు చేపట్టింది. వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. రహదారిని ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు.
అక్రమ కట్టడాలపై నోటీసులు ఇచ్చినా.. ఎటువంటి స్పందనా లేకపోవటంతో అధికారులు నేడు కూల్చివేతలు చేపట్టారు. భారీ యంత్రాలతో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఇటీవల హైదరాబాద్ శివారు నాగారం మున్సిపాలిటీలోనూ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన పలు ఇండ్లను నేలమట్టం చేశారు. ముందుగానే హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి 15 రోజులు గడువు ఇచ్చారు. అయినా ఆక్రమణ దారుల నుంచి స్పందన లేకపోవటంతో.. రంగంలోకి దిగిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.
ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఈ ఏడాది జులైలో హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో 99ను తీసుకువచ్చింది. దీంతో జూలై 26 హైడ్రా కూల్చివేతలను మొదలుపెట్టింది. ఇప్పటి వరకు 30కు పైగా ప్రాంతాల్లో దాదాపు 300 వరకు అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. 100 రోజుల్లో 120 ఎకరాలను స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పగింది. జీహెచ్ఎంసీతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా సంచనలం సృష్టించింది.
అయితే.. హైడ్రా కూల్చివేతలపై పలు చోట్ల వ్యతిరేకత వచ్చింది. పేదల ఇండ్లను కూలుస్తున్నారని పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో హైడ్రా చట్టబద్ధతపై హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. దీంతో హైడ్రాకు ప్రత్యేక అధికారాలు రాగా.. దూకుడుగా కూల్చివేతలు చేపడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa