మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కారు ఈ పథకం తీసుకొచ్చింది. తాజాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ పథకం అమలు గురించి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్రెడ్డి సంకల్పం మేరకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించాలని నిర్ణయించామని వెల్లడించారు. మొదటి విడతలో 150 బస్సులను వెంటనే కొనడానికి చర్యలు తీసుకుంటున్నామని శాంతికుమారి చెప్పారు. వీటిని ఆర్టీకి అద్దెకు ఇవ్వనున్నట్టు ఆమె అన్నారు.
అలాగే, మహిళా సంఘాల ద్వారా 4,000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించనున్నట్టు సీఎస్ వివరించారు. మొదటి దశలో 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వీటికోసం నీటిపారుదల, దేవాదాయ, అటవీ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూములను లీజ్ పద్ధతిన సేకరించాలని సూచించారు. ప్లాంట్ల కోసం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు బ్యాంకుల ద్వారా అందజేయనున్నట్టు చెప్పారు.
ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను టీజీరెడ్కో, డిస్కమ్లు చేపడతాయని ఆమె తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామంలో 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్ను ఏర్పాటు పనులు డిసెంబరు మొదటి వారంలోగా పూర్తి చేస్తామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో భారీ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడంతోపాటు వారు కొనుగోలు చేసిన బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా కరీంనగర్ లను ఎంపిక చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa