ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. రైతన్న చరిత్రను తిరగరాసింది: సీఎం రేవంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 07:45 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావొస్తుంది. గత ఏడాది నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో 64 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా.. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.


కాంగ్రెస్ ఏడాది పాలనకు గుర్తుగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు రైతన్న చరిత్రను తిరగరాసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని గుర్తు చేస్తూ ట్వీట్ చేసారు. పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు.. పోలింగ్ బూతుకు వెళ్లి "మార్పు" కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై.. రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ.. రూ.7,625 కోట్ల రైతు భరోసా.. ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్.. రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్.. రూ.1433 కోట్ల రైతుబీమా.. రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం.. రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఒక్క ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం. ఇది నెంబర్ కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం. ఈ సంతోష సమయంలో.. అన్నదాతలతో కలిసి రైతు పండగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా.' అని రేవంత్ ట్వీట్ చేశారు.


కాగా, నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో రైతు పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ సభను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానుండగా.. నాలుగో విడత రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. దాదాపు 3 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3 వేల కోట్లు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa