ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 10:16 PM

నైరుతి బంగాళాఖాతంలో 'ఫెంగల్ ' తుపాన్ కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 230 కి.మీ, చెన్నైకి 250 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఉత్తర-వాయువ్య దిశగా ఈ తుపాను పయనిస్తుంది వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో తుపాను కదులుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.


 హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు కురుస్తాయన్నారు. నేటి నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. నేడు ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.


ఆది, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.


ఆదిలాబాద్, కొమురం భీం అసిఫాబాద్ జిల్లాల్లో నేడు చలిగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. గాలుల వేగం గంటకు 30-40 కి.మీ ఉంటుందన్నారు. కాగా, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఆదిలాబాద్‌లో ఏజెన్సీ ప్రాంతం చలి తీవ్రతకు గజగజ వణికిపోతోంది. నిజామాబాద్, వికారాబాద్‌, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, జిల్లాల్లోనూ చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గురువారం (నవంబర్ 28) రాత్రి కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.


ఈ జిల్లాలోని సిర్పూర్‌లో 8.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదైందన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 8.2 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి (టి)లో 8.2 డిగ్రీల సెల్సియస్, జైనథ్‌లో 8.4 డిగ్రీల సెల్సియస్, బేలలో 8.5 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa