తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. 24గంటల క్రితం ములుగు జిల్లా తాడ్వాయి మండలం చల్పాకలో జరిగిన భారీ ఎన్కౌంటర్ తో మళ్లీ దండకారణ్యంలో దడ మొదలైంది.దశాబ్ధకాలంగా సైలెంట్గా కార్యకలాపాలకు చేపడుతున్న మావోయిస్టులపై గ్రేహౌండ్స్,భద్రత బలగాలు ఒక్కసారిగా విరుచుకుపడటంతో మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది. ఒకే ఎన్కౌంటర్లో బద్రుతో సహా మరో ఏడుగురు మావోయిస్టులు చనిపోవడం..మరికొందరు పారిపోయారనే సమాచారంతో పోలీసు బలగాలు అడవిలో మావోయిస్టులను ఏరిపారేసేందుకు జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుతం ములుగు జిల్లాతో పాటు మహబూబాబాద్, ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో బలగాలు పహారా కాస్తున్నాయి. ప్రతీ వాహనాన్ని తనిఖీలు చేస్తున్నాయి. అడవిలో అణువణువు జల్లెడ పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ -చత్తీస్ ఘడ్ బార్డర్ లో ప్రత్యేక కూంబింగ్ నిర్వహిస్తున్నాయి బలగాలు.ములుగు జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు ఎస్పీ శబరీష్.
దట్టమైన అడవులు,గిరిజన, ఆదివాసీల ప్రాంతంగా ఉన్న ములుగు జిల్లా ఏజెన్సీలో తాజాగా జరిగిన భారీ ఎన్కౌంటర్ అక్కడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.ఈమధ్య కాలంలో జిల్లాలో ఇంతటి ఎన్కౌంటర్ జరగకపోవడంతో మావోయిస్టులకు ఇదో చావు దెబ్బగానే చూస్తున్నారు. గ్రే హౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన వాళ్లు కాకుండా మరికొందరు పారిపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పోలీసుల హై అలర్ట్ ప్రకటించారు.
అదే విధంగా ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే వారికై గట్టి నిఘా పెట్టారు.అడవిలో కూంబింగ్ చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా ఎస్ఐ కుశ కుమార్ తెలిపారు. వరంగల్ ఏటూరునాగారం ప్రధాన రహదారిపై వచ్చే పోయే వాహనాల్ని ఆపి పోలీసులు క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.వారం రోజుల క్రితం వాజేడు మండలంలో మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్లు అనే నెపంతో ఇద్దర్ని హతమార్చారు. మావోయిస్టుల దుశ్చర్యను సీరియస్గా తీసుకున్న బలగాలు ఛత్తీస్ గడ్, తెలంగాణ బోర్డర్ లో డేగ కన్నేసి ఉంచారు. అందులో భాగంగానే 24గంటల క్రితం చల్పాకలో 8మందిని మట్టుబెట్టారు.అటు పోలీసుల బూట్ల శబ్దం..ఇటు మావోయిస్టుల కదలికలతో ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కోలుకోలేని దెబ్బ తిన్న మావోయిస్టులు మళ్లీ ఏవిధంగా కాల్పులకు తెగబడతారో అని స్థానికులు ,ఏజెన్సీ వాసులు భయాందోళన చెందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa