ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో మరో అతిపెద్ద ఫ్లైఓవర్.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 02, 2024, 07:31 PM

హైదరాబాద్ మహానగరాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. రోజు రోజుకు పెరిగిపోతున్న నగర జనాభాతో.. ట్రాఫిక్ సమస్య కూడా పెరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. మరెన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించినా.. పరిస్థితి మాత్రం అలాగే ఉంటోంది. ట్రాఫిక్ కష్టాలను తీర్చే క్రమంలో ప్రభుత్వం.. మరిన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ పరిధిలో అతిపెద్ద ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నారు. నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు.. ఆరు లేన్ల ఫైఓవర్ నిర్మించారు. వివిధ కారణాల వల్ల ఈ ఫ్లైఓవర్ ప్రాజెక్టు.. ఏళ్ల తరబడి నిర్మాణం జరగ్గా.. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ ప్రారంబానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లోనే అతిపెద్ద రెండో ఫ్లైఓవర్‌గా రూపుదిద్దుకున్న ఈ ఫ్లైఓవర్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది.


నాలుగు కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో బైడైరెక్షనల్‌ మార్గంగా ఆరు లేన్లతో నిర్మితమైన ఈ అతిపెద్ద ఫ్లైఓవర్‌ కోసం ప్రభుత్వం ఏకంగా.. రూ.636 కోట్లు ఖర్చయినట్టు సమాచారం. అయితే.. ఫ్లైఓవర్‌కు రెండువైపులా 8 కిలోమీటర్ల మేర.. సర్వీస్ రోడ్డు పూర్తి చేయడమే అధికారులకు అతి పెద్ద సవాల్‌‌గా మారింది. సర్వీస్ రోడ్డుకు.. అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తూ పనులను చకచకా నిర్మిస్తున్నారు అధికారులు. కాగా.. ఈ ఫ్లైఓవర్ పనులు దాదాపుగా 90 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది.


హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కూడా ఇటీవలే ఫ్లైఓవర్ పనులను పర్యవేక్షించారు. అన్ని కుదిరితే డిసెంబర్ 3వ తేదీన ఈ ఫ్లైఓవర్‌ను.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేఫత్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు పేరుతో ఘనగా సంబురాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. పలు కీలక అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఈ ఫ్లైఓవర్‌ను కూడా రేవంత్ రెడ్డి ప్రారంభించి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.


ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే.. శాస్త్రీపురం, కాలాపత్తర్ వంటి కీలకమైన రద్దీ జంక్షన్‌లలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లే వాహనదారులకు కూడా ట్రాఫిక్ఇబ్బందులు తప్పుతాయని ఆశిస్తున్నారు. తాడ్బన్, దానమ్మ హట్స్, హసన్ నగర్ జంక్షన్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన పని లేకుండా దూసుకెళ్లిపోవచ్చు. ఫలితంగా.. జూపార్క్‌‌‌‌‌‌‌‌కు వచ్చే సందర్శకులకు, పాతబస్తీవైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం సులభతరం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa