ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో ఖమ్మం జిల్లా నుండి ఎంపికై శిక్షణ తీసుకున్నటువంటి లబ్ధిదారులకు బ్యాంకర్లతో మాట్లాడి వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ కు బిజెపి రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేతివృత్తుల వారి అభివృద్ధికి తోడ్పాటు ను అందించడానికి, పేదలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాసటగా నిలిచి వారి ఆర్థిక స్థితిని మెరుగు పరిచేందుకు ఈ పథకం తీసుకు వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని అటకెకించారని, ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్న కుల వృత్తులు వారికి శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక స్థితి మెరుగుపర్చడానికి నిధులు మంజూరు చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కొరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఈ పథకం అమలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తారనే భయంతోనే ఈ పథకాన్ని అటకెకించారనీ వారు మాట్లాడారు. బ్యాంకర్ల తో మాట్లాడి వెంటనే రుణాలు మంజూరు అయ్యేలా చేయాలని కోరారు.
ఇదివరకే కొంతమందికి శిక్షణ ఇప్పించారని, వారికి ఇంతవరకు రుణాలు మంజూరు కాలేదని వెంటనే శిక్షణ పూర్తయిన వారికి రుణాలు మంజూరు చేసి వారికి చేయూత అందించాలని కోరారు. లేని పక్షంలో పేద ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్న రవి, ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అంజయ్య, 7వ డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, sc మోర్చ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, దొంతు జ్వాలా గౌడ్, రుద్ర గాని మాధవ్, అపతి రామారావు, చల్లా నాగులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa