ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వస్తువులపై జీఎస్టీ 35 శాతానికి పెంపు.. కౌన్సిల్ భేటీలో నిర్ణయానికి ఛాన్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 10:12 PM

జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు గరిష్ఠంగా ఉన్న పన్ను శ్లాబు 28 శాతం కాగా.. దాన్ని మరింత పెంచి 35 శాతం పన్ను శ్లాబును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ 35 శాతం పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వస్తువుల లెక్కలు కూడా తేల్చినట్లు సమాచారం. ఇక త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ 35 శాతం పన్ను శ్లాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. కొన్ని వస్తువులను మరింత ప్రియం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంతకీ ఈ 35 శాతం పన్ను శ్లాబులో ఏమేం వస్తువులుంటాయో అనే ఆసక్తి పెరుగుతోంది.


GST: మరికొన్ని రోజుల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని వస్తువులపై పన్ను శ్లాబులు పెంచడం, మరికొన్ని వస్తువులపై పన్ను శ్లాబులు తగ్గించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 148 రకాల వస్తువులపై మార్పులు చేర్పులు చేసేందుకు జీఎస్టీ మంత్రుల గ్రూపు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వీటికి ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు 28 శాతం శ్లాబులో ఉన్న కొన్ని వస్తువులపై పన్నును 35 శాతానికి పెంచనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు 5, 12, 18, 28 శాతం ఉన్న పన్ను శ్లాబులకు అదనంగా 35 శాతం పన్ను శ్లాబు వచ్చి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


ఇక కొన్ని రకాల పానీయాలు, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీని పెంచాలని జీఎస్టీపై ఏర్పాటైన మంత్రుల గ్రూప్ నిర్ణయించినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలుస్తోంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, కొన్ని రకాల డ్రింక్స్ ప్రస్తుతం అత్యధిక పన్ను శ్లాబు అయిన 28 శాతం జీఎస్టీ పరిధిలో ఉండగా.. కొత్తగా 35 శాతం పన్ను శ్లాబును తీసుకువచ్చి.. అందులోకి మార్పులు చేయాలని.. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌పై ఏర్పాటైన మంత్రుల గ్రూపు -జీఓఎం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.


ఈనెల 2వ తేదీన బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన సమావేశం అయిన జీఎస్టీ మంత్రుల గ్రూపు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి రూ.1500 వరకు ధర ఉండే రెడీమేడ్ బట్టలపై 5 శాతం.. రూ. 1500 నుంచి రూ. 10 వేల మధ్య ఉండే రెడీమేడ్ బట్టలపై 18 శాతం జీఎస్టీని విధించనున్నట్లు సమాచారం. ఇక రూ.10 వేల కంటే ఎక్కువ ధర కలిగిన బట్టలపై 28 శాతం జీఎస్టీ ఉండనుంది. ఈ క్రమంలోనే మొత్తం 148 వస్తువులపై పన్ను శ్లాబులను మార్చాలని జీఎస్టీ మంత్రుల గ్రూపు సిఫార్సు చేసింది.


ఈనెల 21వ తేదీన జరగనున్న జీఎస్టీ మంత్రిమండలి సమావేశంలో ఈ సిఫార్సులపై చర్చ జరగనున్నట్లు సమాచారం. పన్ను శ్లాబుల మార్పులకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం కారు, వాషింగ్ మెషీన్ లాంటి లగ్జరీ వస్తువులు, ఎరేటెడ్ వాటర్, పొగాకు ఉత్పత్తులపై అత్యధికంగా 28 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. పన్ను శ్లాబుల మార్పులకు సంబంధించి మంత్రుల గ్రూపు తయారు చేసిన రిపోర్టును త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్‌కు అందించనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa