ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక.. సర్వే ప్రారంభం, ఈ నెలాఖరు డెడ్‌లైన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 07:31 PM

తెలంగాణలో ఇండ్లు లేని పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం.. ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ను సైతం తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 80,54,554 దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్‌లో అధికారులు వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను ఏర్పాటు చేశారు. ఒక సర్వేయర్ రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్‌గా పెట్టారు. మున్సిపాలిటీల్లో సర్వేయర్లుగా.. వార్డు అధికారి, బిల్‌ కలెక్టర్, జూనియర్‌ అసిస్టెంట్, గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బందిని నియమిస్తున్నారు. ఈ నెలాఖరులోగా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది.


గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే గురించి ఒక రోజు ముందే అధికారులు సమాచారం ఇస్తున్నారు. అధికారులు ఇళ్లకు వచ్చే సరికి సంబంధిత దస్త్రాలు సిద్ధం చేసుకొని ఉండాలని దరఖాస్తుదారుకు సూచిస్తున్నారు. ఇండ్ల కేటాయింపులో ముందుగా.. దివ్యాంగులు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, ఒంటరి మహిళలు, సఫాయి కార్మికులు, ఆదివాసీలకు ప్రాధాన్యం ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారు ఉంటున్న సొంత లేదా అద్దె ఇంటి ఫొటోలను మూడు చొప్పున తీసి అప్‌లోడ్‌ చేయనున్నారు. వారికున్న స్థలం వివరాలు సైతం సేకరిస్తున్నారు. వీటిపై ఇప్పటికే సర్వేయర్లకు శిక్షణ పూర్తయ్యింది. తొలి విడతలో స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు ఇళ్లను అందించనున్నారు.


వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలో 20 లక్షల మంది పేదల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. యాప్‌ ద్వారా వీరిలో అర్హులను గుర్తిస్తున్నామని.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 3.3 లక్షల మంది వివరాలు సేకరించినట్లు వెల్లడించారు. పేదల్లోనూ అతి పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. వివిధ దశల్లో నిర్మాణాలకు యాప్‌ ద్వారా సేకరించిన సమాచారంతోనే బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఉంటుందని అన్నారు. ప్రజాపాలనలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేయనివారు ప్రత్యేక కౌంటర్లలో ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. దరఖాస్తుదారులు మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa