రానున్న అయిదేళ్లలో తెలంగాణ పర్యాటక రంగానికి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, అదనంగా మూడు లక్షల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించింది. ఈ మేరకు కొత్త పాలసీపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రపంచ దేశాలతో పోటీపడేలా పర్యాటక కేంద్రాల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని మంత్రి జూపల్లి వెల్లడించారు. కొత్త ప్రాజెక్టులతో దేశ, విదేశీ పర్యాటకులకు తెలంగాణను గమ్యస్థానంగా మలచడమే తమ లక్ష్యమని చెప్పారు.
రాష్ట్రంలో ‘సురక్షిత పర్యాటక’ వాతావరణాన్ని సృష్టించే ప్రణాళికలను ప్రకటించారు. పర్యాటకుల భద్రతకు, ముఖ్యంగా టూరిస్టు ప్రదేశాల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టులకు భద్రత కల్పించేలా ప్రత్యేక టూరిస్ట్ పోలీసు యూనిట్లు, టూరిస్టు పెట్రోలింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని సర్కార్ యోచిస్తోంది. మహిళా పర్యాటకులకు భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా టూరిజం ఫ్రెండ్లీ ఇండెక్స్ ద్వారా భద్రతా ప్రమాణాలను పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని పర్యాటక ప్రాంతాలలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.
ఇక శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో 1-2 గంటల ప్రయాణ దూరంలో ఐకానిక్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గోదావరి, కృష్టానది పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు హౌజ్ బోట్స్, వాటర్ స్పోర్ట్స్, వాటర్ కార్నివల్స్ ఉండేలా ‘రివర్ ఫెస్టివల్స్’ను ప్రారంభించాలని భావిస్తున్నారు. వారసత్వ కట్టడాలు, కోటలు, ప్యాలెస్లు, సమాధులు, పర్యాటక ఆస్తుల పరిరక్షణ కోసం కార్పొరేట్ సంస్థలు వాటిని దత్తత తీసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రీజినల్ రింగు రోడ్డు గుండా డ్రై పోర్టుల అభివృద్ధితో పాటు గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు.
పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధారంగా ఔటర్ రింగ్ ఎగ్జిట్ పాయింట్స్ గుండా లగ్జరీ బ్రాండెడ్ మాల్స్, ఫ్యాక్టరీ ఔట్లెట్స్ను డెవలప్ చేయాలని చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్త ఐకానిక్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయటం, ఆధ్యాత్మిక ప్రదేశాలు, బౌద్ధ ప్రదేశాలు, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు. అన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతాల్లో హెలిప్యాడ్లను కూడా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. కొత్త టూరిజం పాలసీల అమలుకు కమిటీలు వేయనున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa