సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ సినీనటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. పుష్ప 2 ప్రీమియర్ షో కోసం సినిమా బృందం అప్లికేషన్ పెట్టుకుంటే.. పోలీసులు తిరస్కరించారు. సంధ్య థియేటర్ దగ్గర ఒకటే దారి ఉందని.. హీరో, హీరోయిన్లు రావటం వల్ల అభిమానులను కంట్రోల్ చేయలేమని పోలీసులు స్పష్టంగా తెలియజేశారని చెప్పుకొచ్చారు. అయినా సరే.. డిసెంబర్ 4న హీరో, హీరోయిన్లు థియేటర్కు వచ్చారు. హీరో కారులో వచ్చి సినిమా చూసి సైలెంట్గా వెళ్లిపోతే సరిపోయేదని.. కానీ రోడ్డు షో చేసుకుంటూ రావటం వల్లే ఇంతా ఘోరం జరిగిందని రేవంత్ రెడ్డి వివరించారు.
హీరో థియేటర్లోకి వెళ్లే సమయంలో అభిమానులు ఒక్కసారిగా ఆయనను చూసేందుకు ఎగబడ్డారని.. ఆ సమయంలో హీరో ప్రైవేటు సైన్యం సుమారు 50 నుంచి 60 మంది బౌన్సర్లు అభిమానులను ఇష్టారీతిన తోసేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే తోపులాటలో హీరో బాల్కనీలోకి వెళ్లి కూర్చోగా.. టికెట్లు కొన్నవాళ్లు, కొనని వాళ్లు అందరూ కలిసి థియేటర్ లోపలికి ఎగబడ్డారు. అప్పటికే థియేటర్ బయట తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి, తన కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారని.. అది చూసి పోలీసులు వాళ్లను బయటకు తీసుకొచ్చి సీపీఆర్ చేశారని కానీ.. అప్పటికే ఆ మహిళ ప్రాణాలు కోల్పోగా, పిల్లాడు కోమాలోకి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. తొక్కిసలాటలో కన్నబిడ్డను పట్టుకుని తల్లి చనిపోయిందని.. కుమారుడు ఇప్పటికీ చావుబతుకుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
బయట నెలకొన్న పరిస్థితులను గమనించి.. పోలీసులు ఆ హీరోను తిరిగి పంపించాలని థియేటర్ యాజమాన్యానికి చెప్తే పట్టించుకోలేదని.. పోలీసులను కూడా లోపలికి వెళ్లనివ్వలేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అప్పటికీ.. డీసీపీ హీరో దగ్గరికి వెళ్లి.. బయట పరిస్థితి చేయిదాటిపోయిందని మీరు వెంటనే తిరిగి వెళ్లిపోవాలని చెప్తే.. సినిమా అయ్యేంత వరకు ఉండి వెళ్తానంటూ అక్కడే కూర్చున్ననాడని చెప్పుకొచ్చారు. ఇప్పటికిప్పుడు వెళ్లకపోయే అరెస్ట్ చేసి.. జైలుకు తీసుకెళ్లాల్సి వస్తుందని డీసీపీ హెచ్చరిస్తే.. అప్పుడు ఆయన వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడన్నారు. ఆ వెళ్లిపోవటం కూడా సైలెంట్గా కారులో కూర్చొని వెళ్లకుండా రూఫ్ టాప్లో నుంచి అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లాడని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ సినీ నటుడిని పరామర్శించడానికి హీరోలంతా క్యూ కట్టారని.. కానీ, చావు బతుకుల్లో ఉన్న బాలుడ్ని మాత్రం ఎవరూ పరామర్శించలేదన్నారు. అల్లు అర్జున్కు కాలు పోయిందా.. కన్ను పోయిందా.. దేనికి పరామర్శలని ప్రశ్నించారు. ఆస్పత్రిలో ఉన్న బాలుడిని మాత్రం ఎందుకు పట్టించుకోరని నిలదీశారు.
సినిమా వాళ్లు వ్యాపారం చేసుకోవాలని.. కానీ ప్రాణాలతో చెలగాటం ఆడితే మాత్రం అస్సలు ఊరుకునేది లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాను సీఎంగా ఉన్నంత కాలం.. టికెట్ రేట్లు, బెన్ఫిట్ షోలు ఉండవని బల్లగుద్ది చెప్పారు. మరోవైపు.. తాము అధికారంలో ఉన్నంత కాలం మీ ఆటలు సాగవంటూ సినిమా వాళ్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa